ఢిల్లీ : కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ఐదు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం అమెరికా బయల్దేరి వెళ్లనున్నారు. అమెరికన్ కంపెనీల నుండి కొవిడ్-19 వ్యాక్సిన్ల సేకరణ, అదేవింగా కలిసి ఉత్పత్తి చేసే విషయమై చర్చించేందుకు జైశంకర్ అమెరికా బయల్దేరి వెళ్తున్నారు. మే 24 నుంచి 28 వరకు జరిగే పర్యటన సందర్భంగా ఎస్ జైశంకర్ అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్తో చర్చలు జరపనున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. అదేవిధంగా న్యూయార్క్లో యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ను జైశంకర్ కలుస్తారని సమాచారం.
వాషింగ్టన్ డీసీలో విదేశాంగ మంత్రి తన కౌంటర్ స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్తో చర్చలు జరుపనున్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా కేబినెట్ సభ్యులు, సీనియర్ అధికారులను కూడా ఆయన కలుస్తారని విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పర్యటనలో భాగంగా ఒకవైపు ఆర్థిక సంబంధాల్లో భాగంగా బిజినెస్ ఫోరంతో సమావేశాలు, మరోవైపు కొవిడ్-19 సంబంధిత సహకారంపై చర్చించనున్నట్లు తెలిపింది.