ఎన్నో ఏండ్ల్ల నిరీక్షణకు తెరపడింది. చెమర్చిన కండ్లతో ఇండ్లను చూడగానే లబ్ధిదారులు ఆనందబాష్పాలు కురిపించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత జాప్యం ఏర్పడటంతో పాటు విపక్షాల కుటిల రాజకీయాల మధ్య ఇండ్లు వస్తాయా లేదా అన్న సంశయంతో ఉన్న ఆ నిరుపేదలకు సర్కారు కొండంత భరోసా కల్పిస్తూ వచ్చింది.
ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనవడంతో పాటు కరోనా కారణంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్నా.. అనుకున్న విధంగా డబుల్ రెండు పడకల గదుల ఇండ్లను పూర్తి చేసి గురువారం లబ్ధిదారులకు అట్టహాసంగా అందించింది. ఇంట్లోకి అడుగుపెట్టిన లబ్ధిదారుల సంబురం అంతా ఇంతా కాదు. ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రసూల్పురా కట్టమైసమ్మ సిల్వర్ కంపౌండ్లో రాష్ట్ర సర్కారు నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవం పండుగలా సాగింది. రూ. 17.36 కోట్లతో నూతనంగా నిర్మించిన 168 రెండు పడకల గదుల ఇండ్లను రాష్ట్ర మంత్రులు మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే సాయన్న కలిసి ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ అర్హులైన వారందరికీ గూడు కల్పించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. డబుల్బెడ్రూం ఉండాలనే ఉద్దేశంతో సుమారు రూ.7.75 లక్షలతో ఒక డబుల్బెడ్రూం ఇల్లు నిర్మించి ఇచ్చామన్నారు. అన్ని సౌకర్యాలతో ఇంటిని నిర్మించి ఇవ్వడంతో చాలా కుటుంబాల్లో ఇబ్బందులు దూరమయ్యాయని పేర్కొన్నారు.
లబ్ధిదారులకు గూడు అందించడంతో డబుల్ ఇండ్లు పొందిన నిరుపేదలతో పాటు నిరంతర శ్రమతో బస్తీవాసులకు తోడ్పాటు నందిస్తూ వచ్చిన ప్రజాప్రతినిధులు సైతం ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఉద్వేగానికి లోనయ్యారు. డబుల్ ఇండ్లు నిర్మించే కాంట్రాక్టర్తో పాటు ఇటు అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఇండ్ల నిర్మాణ స్థలంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడ్డా దగ్గరుండి వాటి పరిష్కారానికి కృషి చేశారు.
ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న కట్టమైసమ్మ సిల్వర్ కంపౌండ్ కాలనీ వాసుల సొంతింటి కలను సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీర్చింది. కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన వసతులు కల్పించి నిర్మించిన ఇండ్లను పేదలకు ఉచితంగా ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుంది. ఇండ్లు పొందిన లబ్ధిదారులు గృహ సముదాయ నిర్వహణను సక్రమంగా చేపట్టాలి. నగరం రోజురోజుకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి సాధిస్తున్నదని, అందుకు తగినట్లుగా ప్రజలు కూడా పరిశుభ్రత పట్ల శ్రద్ధపెట్టాలని సూచించారు. – జక్కుల మహేశ్వర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు, కంటోన్మెంట్
మాకు పాత ఇల్లు ఉంది. వానకాలమైతే నిద్రలేని రాత్రుళ్లు గడిపేటోళ్లం. ఎప్పుడు వర్షం పడినా కురుస్తుండేది. ఇప్పుడు రెండు పడకల గదుల ఇల్లు రావడంతో ఆ బాధ పోయింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ సార్కు ధన్యవాదాలు.- ఎస్.లక్ష్మి, లబ్ధిదారురాలు, సిల్వర్ కంపౌండ్
ఈ రోజుల్లో ఇల్లు నిర్మించాలంటే చాలా డబ్బులు కావాలి. నేను కూలీ పని చేసి కుటుంబాన్ని పోషించుకుంటా. ఇల్లు కట్టలేని పరిస్థితి మాది. ప్రభుత్వం డబుల్బెడ్ రూం ఇల్లు నిర్మించి ఇవ్వడం నాకు సంతోషంగా ఉంది. ఇల్లు బాగానే ఉంది. ప్రభుత్వం ఇంత ఖర్చు చేసి పేదవారికి ఇల్లు కట్టిచ్చి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. రూ. 25 లక్షలు భవనం ఇచ్చారు. మా కుటుంబ సభ్యులు ఎప్పుడూ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – సి. లలిత, లబ్ధిదారురాలు, సిల్వర్ కంపౌండ్