అమీర్పేట, జూలై 14 : భక్తుల ఆరాధ్య దేవతగా, కోరిన కోరికలు తీర్చే బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం రమణీయంగా సాగింది. మూడు రోజులపాటు జరిగిన అమ్మవారి కల్యాణ మహోత్సవాలు బుధవారం సాయంత్రం రథోత్సవంతో సమాప్తమయ్యాయి. అందంగా అలంకరించిన రథంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. రంగురంగుల విద్యుత్ దీపాల మధ్య వెలుగొందుతూ అమ్మవారు పురవీధుల్లో ఊరేగారు. అశేష భక్తుల జయజయధ్వానాల మధ్య మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్..మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, ఈవో అన్నపూర్ణ, దేవాలయ చైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్లతో కలిసి రథోత్పవాన్ని ప్రారంభించారు. బల్కంపేట చౌరస్తా మీదుగా ఆర్అండ్బి కార్యాలయం, ఎస్ఆర్నగర్ కమ్యూనిటీహాలు, ఎస్ఆర్నగర్ వేంకటేశ్వరస్వామి దేవాలయం మీదుగా బీకేగూడ చౌరస్తా, 60 ఫీట్ రోడ్డు మీదుగా తిరిగి ప్రధాన ఆలయానికి చేరుకుంది. రథోత్సవంలో కళాకారుల కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఉదయం ఆలయ ఆవరణలో నిర్వహించిన చండీయాగంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
సిటీబ్యూరో, జూలై 14 (నమస్తేతెలంగాణ): ఈనెల 25, 26 తేదీల్లో నిర్వహించే ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల ఏర్పాట్లపై దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ సమీక్షించారు. అరణ్య భవన్లో బుధవారం జరిగిన ఈ సమీక్షలో అధికారులు, నిర్వహణ కమిటీకి పలు సూచనలు చేశారు. ఉత్సవాలు జరిగే ప్రాంతంలో రోడ్ల మరమ్మతు, ఆలయం వద్ద లైటింగ్ సౌకర్యం, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని, కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, భక్తులు మాస్క్లు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి జాగ్రత్తలపై దృష్టి పెట్టాలని, అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రులు ఆదేశించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, పర్యాటక అభివృద్ధిశాఖ ఎండీ మనోహర్, దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు.