సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ)/చార్మినార్ : ఆగస్టు 1న నిర్వహించనున్న పాతబస్తీ బోనాల ఉత్సవాల ఏర్పాట్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7 కోట్లు వెచ్చిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సాలార్జంగ్ మ్యూజియంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ పాతబస్తీ బోనాల నిర్వహణ, ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, ఉత్సవాల నిర్వాహకులు, ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ అభివృద్ధి పనులు, భక్తులకు కనీస వసతులు తదితర 132 పనుల కోసం రూ.7 కోట్లు వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు.
అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించడం జరుగుతుందన్నారు. ఉత్సవాలకు ప్రభుత్వం రూ.90 కోట్లను ఖర్చు చేస్తుండగా.., ఇందులో రూ.15 కోట్లు వివిధ ఆలయాలకు ఆర్థిక సహాయం కింద, మరో రూ.75 కోట్లు బోనాల ఉత్సవాల ఏర్పాట్ల కోసం ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ శంకర్ యాదవ్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జోనల్ కమిషనర్ సామ్రాట్ అశోక్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, సీజీఎం వినోద్ భార్గవ, ట్రాన్స్ కో సీజీఎం స్వామి, డీసీపీ గజారావు, ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాములు నాయక్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, ఐ అండ్ పీఆర్, సీఐఈ రాధాకృష్ణ, వైద్య, ఆరోగ్య శాఖ ఎస్పీహెచ్ఓ లక్ష్మణ్, పర్యాటక శాఖ ఎస్ఈ అశోక్, వివిధ ఆలయాల కమిటీ సభ్యులు, ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.