బన్సీలాల్పేట్, జూన్ 28: పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల సాకారమైందని, మురికివాడల స్థానంలో వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇచ్చారని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం బన్సీలాల్పేట్ డివిజన్లోని పొట్టి శ్రీరాములు నగర్ బస్తీలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కార్పొరేటర్ కే.హేమలత, జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, సికింద్రాబాద్ ఆర్డీవో వసంత కుమారి, తాసిల్దార్ బాలశంకర్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, హౌజింగ్ సీఈ సురేశ్, ఎస్ఈ కిషన్, ఈఈ ఎం.వెంకట్దాస్ రెడ్డి, జలమండలి జీఎం రమణారెడ్డి, టీఆర్ఎస్ సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్తో కలిసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కాలనీని ప్రారంభించారు.
అనంతరం, వేదికపై ప్రజల సమక్షంలో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించి, పొజీషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ 40 ఏండ్లుగా శ్మశాన వాటిక పక్కన, కనీస సదుపాయాలు లేక, ఇరుకైన ఇండ్లలో జీవించిన పీఎస్ నగర్ బస్తీవాసుల కష్టాలు ఇప్పుడు తొలగిపోయాయన్నారు. 14 కోట్ల రూపాయలతో 162 ఇండ్లను సకల సదుపాయాలతో నిర్మించామన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో పేదల నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఆత్మగౌరవంతో జీవించేలా రెండు పడక గదులు, హాలు, కిచెన్, టాయిలెట్లతో కూడిన ఇల్లును లబ్ధిదారులకు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
తొమ్మిది అంతస్తుల భవనంలో లిఫ్టులు, అగ్నిమాపక వ్యవస్థ, పార్కింగ్ సదుపాయం, ఆహ్లాదకరమైన పార్కు, దుకాణాల సముదాయం లాంటివి ఏర్పాటు చేశామన్నారు. ఇండ్ల సముదాయం ఆవరణలో నిర్మించిన దుకాణాలను కూడా లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి స్థానికులకే కేటాయిస్తామన్నారు. చెట్లను పెంచాలని, పారిశుధ్యం నెలకొల్పాలని, పరిశుభ్రతను పాటించాలని మంత్రి సూచించారు. బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు అరుణ, రూప, శేషు కుమారి, టీఆర్ఎస్ నాయకులు జి.పవన్ కుమార్ గౌడ్, కె.లక్ష్మీపతి పాల్గొన్నారు.
నేను 40 ఏండ్ల నుండి ఈ బస్తీని చూస్తున్న. గుడిసెలు వేసుకుని, ఇరుకైన గల్లీలలో రేకుల ఇండ్లలో, తాగడానికి నీళ్లు లేక, డ్రైనేజీ లేక, నడవడానికి సరైన దారి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అందుకే సీఎం కేసీఆర్తో మాట్లాడి ఇలాంటి బస్తీలను మార్చాలని కోరాను. ఆయన వెంటనే అంగీకరించడంతో దేశంలోనే తొలిసారిగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి నా సనత్నగర్ నియోజకవర్గంలోని ఐడిహెచ్ కాలనీలో శ్రీకారం చుట్టాం. రికార్డు సమయంలో 400 ఇండ్లను నిర్మించి, లబ్ధిదారులకు అందించాం. గవర్నర్ కూడా మెచ్చుకున్న ఆత్మగౌరవ నివాసాలు ఇవి. నాలుగు బస్తీలలో 59 కోట్లతో 682 ఇండ్లను నిర్మించాము. – మంత్రి తలసాని
యాభై ఏండ్ల గోస మాది. మా బాధలు ఎన్నని చెప్పాలి. చుట్టాలు రాకపాయె. చంటి పిల్లలతో గుడిసెలో ఉండగా వాన పడితే నీళ్లన్నీ ఎత్తి బయట పడేసేవాళ్లం. రోజు కూలీ పనిచేసుకుని బతికేటోళ్లం. బొందలగడ్డ గుడిసెలలో తిరిగిన శ్రీనివాస్యాదవ్కు మా బాధలన్నీ తెలుసు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మా బస్తీలో కరెంటు స్తంభాలు, తాగడానికి నల్లా పెట్టించారు. ఆయనను నమ్మినం, ఇచ్చిన మాట ప్రకారం మాకు బిల్డింగ్ కట్టించ్చిండు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది బిడ్డా. ఈ సర్కారు సల్లంగుండాలె. – పోచమ్మ, పీఎస్ నగర్ బస్తీ వాసి