సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ), వెంగళరావునగర్, జూన్ 24: పేదలకు నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని, ప్రజల వైద్యం కోసం రూ.10వేల కోట్లను వెచ్చిస్తున్నదని పశు సంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ ఛాతి వైద్యశాలను, స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, సంబంధిత వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి ఆయన గురువారం సందర్శించారు. ప్రభుత్వం నిర్మించతలపెట్టిన సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. సంబంధిత అధికారులతో వైద్యశాల నిర్మాణంపై చర్చించారు. అనంతరం, మంత్రి తలసాని మాట్లాడుతూ చెస్ట్ వైద్యశాలలో టీబీతో పాటు అన్ని వ్యాధులకు సంబంధించిన జనరల్ దవాఖానను కూడా నిర్మిస్తామని వెల్లడించారు.
ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వల్లనే హైదరాబాద్లో నాలుగు సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలకు అనుమతులు వచ్చాయని తెలిపారు. త్వరలోనే ఉస్మానియాకు నూతన వైద్యశాలను, నీలోఫర్ వైద్యశాలలో కొన్ని అదనపు విభాగాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. ఎర్రగడ్డ ఛాతి దవాఖాన ఆవరణలో ఛాతి, సూపర్ స్పెషాలిటీ దవాఖన, అంతర్జాతీయ స్థాయిలో కన్వెన్షన్ సెంటర్ను నిర్మించేందుకు ప్రభుత్వం తగిన ప్రణాళికతో ముందుకు పోతున్నదన్నారు. నగరంలోని ఎర్రగడ్డ ఛాతి దవాఖానతో పాటు నీలోఫర్ దవాఖాన, కొత్తపేట పండ్ల మార్కెట్, అల్వాల్లోని ప్రభుత్వ దవాఖానలను రూ.5 వేల కోట్లతో ఆధునీకరించనున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ దవాఖానాల నిర్మాణం పూర్తయితే ఇదీ హైదరబాద్ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయంగా అభివర్ణంచారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్ రెడ్డి, టీఎస్ ఎండీసీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక అధికారి ఉమర్ జలీల్, దవాఖానా సూపరింటెండెంట్ వైద్యులు మహబూబ్ఖాన్, ప్రమోద్ కుమార్, నరేందర్, అనితా భల్లా, టీఎన్జీఓస్ నగర ఉపాధ్యక్షులు ఉమర్ఖాన్, వెంగళరావునగర్ కార్పొరేటర్లు దేదీప్య విజయ్, రాజ్కుమార్ పటేల్, సీఎన్రెడ్డి, వనం సంగీతశ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.