సిటీబ్యూరో, మెహిదీపట్నం, జూన్ 15 (నమస్తే తెలంగాణ ) : ముంపు సమస్య రాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇప్పటికే నాలాల్లో పూడిక తీత పనులు పూర్తికావచ్చాయని తెలిపారు. మంగళవారం మంత్రి తలసాని, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వేర్వేరుగా నగరంలోని పలు నాలాలను సందర్శించి పూడిక తీత పనులను పరిశీలించారు. నాంపల్లి నియోజకవర్గం అహ్మద్నగర్ డివిజన్ మాసాబ్ట్యాంక్ పెన్షన్ ఆఫీస్ సమీపంలోని బుల్కాపూర్ నాలా పూడికతీత పనులను ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ప్రావీణ్య, సర్కిల్ -12 డిప్యూటీ కమిషనర్ ఇన్కెషాఫ్ అలీలతో కలిసి మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ బుల్కాపూర్ నాలాలో 1.65 కిలోమీటర్ల మేర పూడికతీత నిమిత్తం రూ.70 లక్షల నిధులు కేటాయించామని తెలిపారు. పెన్షన్ ఆఫీస్ వద్ద బుల్కాపూర్ నాలా పక్కన అక్రమనిర్మాణం కారణంగా నాలా కుచించుకుపోయిందని స్థానికులు మంత్రికి ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన ఆయన అక్రమ నిర్మాణాల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గం ఇన్చార్జి సీహెచ్.ఆనంద్కుమార్ గౌడ్, ఎస్ఈ సహదేవ్ రత్నాకర్, ఈఈ లాల్సింగ్, ఎంఐఎం నాయకులు సర్పరాజ్ సిద్దికీ తదితరులు పాల్గొన్నారు.
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. నాలాల పూడికతీత , విస్తరణ పనుల పురోగతి, పారిశుధ్య పనులను డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మేయర్ సందర్శించారు. 139 డివిజన్ పరిధిలోని పీవీఎన్ కాలనీ వద్ద రూ.50 లక్షలతో చేపట్టనున్న యూజీడీ బాక్స్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. ఆనంతరం మేయర్ బంజారాహిల్స్ ప్రేమ్నగర్ మీదుగా వెళ్లే బల్కాపూర్ నాలా పూడికతీత పనులు, రిటైనింగ్ వాల్స్, కల్వర్ట్ పనులను పరిశీలించారు. పనులను వేగిరం చేయాలని అధికారులను ఆదేశించారు.