బన్సీలాల్పేట్, జూన్ 14: పేద ప్రజలు ఆత్మ గౌరవంతో జీవించాలని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి పరిశ్రమ, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సనత్నగర్ నియోజకవర్గంలోని నాలుగు ప్రాంతాలలో రూ.59 కోట్ల వ్యయంతో నిర్మించిన 682 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఈ నెల 26 నుంచి లబ్దిదారులకు పంపిణీ చేయనున్నామన్నారు. మాసబ్ట్యాంక్లోని తన ఛాంబర్లో ఇండ్ల నిర్మాణం పురోగతి, ఇండ్ల నిర్మాణ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లపై హైద్రాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, రెవెన్యూ, జీహెచ్ఎంసీ హౌజింగ్ విభాగాల అధికారులతో మంత్రి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ 26న రాంగోపాల్పేట్ డివిజన్లోని అంబేద్కర్ నగర్లో రూ.28.5 కోట్లతో నిర్మించిన 330 ఇండ్లు, 28న బన్సీలాల్పేట్ డివిజన్లో పొట్టి శ్రీరాములు నగర్లో రూ.14 కోట్లతో నిర్మించిన 162 ఇండ్లు, జూలై 1న జీవై రెడ్డి కాంపౌండ్లో రూ.15.57 కోట్లతో నిర్మించిన 180 ఇండ్లు, జూలై 5న గొల్ల కొమరయ్య కాలనీలో రూ.85 లక్షలతో నిర్మించిన 10 ఇండ్లను పండగ వాతావరణంలో ప్రారంభించి లబ్దిదారులకు అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే ఉన్నతమైన లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనల మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రెండు పడక గదుల ఇండ్లను పూర్తిగా ప్రభుత్వమే అన్ని ఖర్చులను భరించి నిర్మించిందని మంత్రి అన్నారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ లాంటి మౌళిక వసతులు, వాహనాల పార్కింగ్ సదుపాయం, దుకాణాల సముదాయం లాంటివి ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కె.హేమలత, రాంగోపాల్పేట్ కార్పొరేటర్ సీహెచ్ సుచిత్ర, మాజీ కార్పొరేటర్లు ఎ.అరుణ, ఎ.రూప, సికింద్రాబాద్ ఆర్డీఓ వసంత కుమారి, తహసీల్దార్లు బాలశంకర్, జానకి, జుబేదా, జీహెచ్ఎంసీ హౌజింగ్ ఎస్ఈ కిషన్, ఈఈ వెంకట్దాస్ రెడ్డి, వివిధ బస్తీలకు చెందిన నాయకులు, పలువురు లబ్దిదారులు పాల్గొన్నారు.