బేగంపేట్ జూన్ 9: జంట నగరాల పరిధిలోని నాలాల్లో 221 కిలో మీటర్ల మేర పూడిక తొలగింపునకు రూ.45 కోట్లు వెచ్చించనున్నట్టు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సనత్నగర్ నియోజకవర్గం రాంగోపాల్పేట డివిజన్ రాష్ట్రపతి రోడ్డులో దర్గా వద్ద రూ.2.35 కోట్లతో చేపట్టిన నాలా వంతెన నిర్మాణపు పనులను ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. వంతెన నిర్మాణపు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, నాలాల్లో పూడిక తొలగింపు పనుల విషయంపై ఈ నెల 11న జీహెచ్ఎంసీ కార్యాలయంతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో తనతో పాటు హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ లోకేశ్ కుమార్లు పాల్గొంటారని చెప్పారు. 124 ప్రాంతాలలో 221 కిలో మీటర్ల మేర నాలాల్లో పూడిక తొలగింపు పనులను చేపట్టినట్టు తెలిపారు.
నాలాల్లో పూడిక తొలగింపు వలన రానున్న వర్షాకాలంలో నాలాల్లోకి వచ్చే నీరు సాఫీగా వెళ్తుందన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో నాలాలతో పాటు మురుగు కాల్వలను కలుపుకొని మొత్తం 884 కిలో మీటర్లు ఉన్నాయని తెలిపారు. నాలాల మరమ్మతులు, పూడిక తొలగింపు పనులను ఆరుగురు ఎస్ఈలతో పాటు ఆయా ప్రాంతాల జోనల్ కమిషనర్లు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రత్యేక మాన్సూన్ టీంలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందుకోసం 128 మినీ మొబైల్ టీంలు, 68 డీసీఎం వాహనాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఒక్కో వాహనంలో నలుగురు సిబ్బంది ఉంటారన్నారు.
భారీ వర్షాలతో చెట్లు కూలిపోడవం, వర్షం నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులను గురిచేసే పరిస్థితులు నెలకొంటే వారికి కేటాయించిన ప్రాంతాలలో ఈ టీంలు చేరుకొని సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు. గత యేడాది కురిసిన వర్షాలకు జీహెచ్ఎంసీ పరిధిలో బీటీ, సీసీ రోడ్లు దెబ్బ తిన్నాయని తెలిపారు. 182 కిలో మీటర్లు మేర బీటీ రోడ్డు మరమ్మతు పనులను రూ.52 కోట్లతో చేపట్టగా, ఇప్పటికి 100 కిలో మీటర్లు పనులు జరిగాయని చెప్పారు. అదే విధంగా 753 కిలో మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం పనులు 204 కోట్లతో చేపట్టగా, ఇప్పటి వరకు 272 కిలో మీటర్ల వరకు పనులు పూర్తి అయినట్టు చెప్పారు.
అంతే కాకుండా, బాక్స్ డ్రెయిన్ నిర్మాణం, డ్రైయిన్ మరమ్మతులు రిటైనింగ్ వాల్వ్ నిర్మాణం, చైన్లింక్ మేష్ వంటి 468 పనులను 298 కోట్లతో చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇందులో 16 కోట్లతో 42 పనులు పూర్తి అయినట్టు వెల్లడించారు. 211 పనులు వివిధ దశలలో ఉన్నాయన్నారు. మిగిలిన 147 పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ యేడాది చివరి వరకు ఈ పనులన్నీంటిని పూర్తి చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు కొంతం దీపిక, చీర సుచిత్ర, జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, ఈఈ శివానంద్, జలమండలి జీఎం రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.