అమీర్పేట్, మే 7 : వర్షాకాలం ముంచుకొస్తున్నందున పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో సెంట్రల్, నార్త్ జోనల్ కమిషనర్లు ప్రావీణ్య, శ్రీనివాస్రెడ్డిలతో పాటు జలమండలి అధికారులతో సమావేశమై పెండింగ్లో ఉన్న పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరోనా, లాక్డౌన్ కారణంగా మందగించిన పనులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. సనత్నగర్ నియోజకవర్గంలో నూతనంగా చేపట్టాల్సిన పనులకు సంబంధించిన నివేదికను ఇవ్వాలని సూచించారు.
వెంటనే ఇందుకు సంబంధించిన అనుమతులు, నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఇప్పటికే వైట్ ట్యాపింగ్ రోడ్లు, శ్మశానవాటికల అభివృద్ధి, స్పోర్ట్స్ కాంప్లెక్స్లను పూర్తి చేయడం జరిగిందని వివరించారు. అమీర్పేట్లో 50 పడకల దవాఖాన నిర్మాణం చేపట్టిన తరువాత మరిన్ని పనులకు సంబంధించి నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు. అదేవిధంగా శిథిలావస్థకు చేరిన బీకేగూడ వార్డు కార్యాలయం పునర్నిర్మాణానికి రూ.4.50 కోట్లు మంజూరయ్యాయని, వెంటనే భవనానికి సంబంధించిన నమూనాను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
బన్సీలాల్పేట్ డివిజన్లోని గండమ్మ గుడి దగ్గర డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సనత్నగర్లో 5ఎంఎల్ సామర్ధ్యంతో నిర్మితమైన రిజర్వాయర్కు పూర్తి స్థాయిలో నీటి లభ్యత ఉండటంలేదని ఫిర్యాదులు వస్తున్నాయని, సమస్యను పరిష్కరించాలని జలమండలి ఎస్ఆర్నగర్ జీఎం హరిశంకర్ను ఆదేశించారు. అదేవిధంగా మేకలమండిలో నిరుపయోగంగా ఉన్న ఓవర్హెడ్ ట్యాంక్ను వినియోగంలోకి తీసుకురావాలని జలమండలి సికింద్రాబాద్ జీఎం రమణారెడ్డికి సూచించారు.