హైదరాబాద్ : ఈ నెల 13వ తేదీన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. అమ్మవారి కళ్యాణం ఏర్పాట్లపై ఆలయ ఆవరణలో మంత్రి తలసాని మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మంత్రి తలసాని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తులాభారాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం నూతనంగా నియమించబడిన ఆలయ కమిటీ సభ్యులు మంత్రి తలసాని సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. 12న ఎదుర్కోళ్లు, 13న కళ్యాణం, 14న రథోత్సవం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కళ్యాణం రోజున ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామని చెప్పారు. కరోనా మహమ్మారి కారణంగా గతేడాది అమ్మవారి కళ్యాణం నిరాడంబరంగా నిర్వహించామని గుర్తు చేశారు. ఈ ఏడాది అమ్మవారి కళ్యాణం ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన మేరకు అన్ని శాఖల ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. అమ్మవారి కళ్యాణం సందర్భంగా బల్కంపేట ఆలయానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి తలసాని ఆదేశించారు. అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని చెప్పారు.
సాంస్కృతిక శాఖ కళాకారులచే పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మంత్రికి వివరించారు.
ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ ప్రావిణ్య, కార్పొరేటర్ కొలన్ లక్ష్మి, వాటర్ వర్క్స్ డైరెక్టర్ కృష్ణ, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, ఆర్ అండ్ బీ ఎస్ఈ పద్మనాభరావు, ఐ అండ్ పీఆర్ సీఐఈ రాధాకృష్ణ, ఆలయ ఈవో అన్నపూర్ణ, వాటర్ వర్క్స్ జీఎం ప్రభు, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి తదితరులు పాల్గొన్నారు.