కళలను ప్రోత్సహించేందుకు గాను రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఆడిటోరియాలను నిర్మించేందుకు తగిన విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక ,ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆ దిశగానే పేద కళాకారులను ఆదుకుంటున్నామన్నారు. విక్రమ్ ఆర్ట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఉగాది టీవీ స్టార్స్ పురస్కారాల ప్రదానోత్సవం కార్యక్రమం గురువారం సాయంత్రం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్ గౌడ్ జ్వోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పురస్కారాలను ప్రదానం చేసిన అనంతరం, మంత్రి మాట్లాడుతూ కళలను, కళాకారులను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం పేద కళాకారులను ఆదుకుంటోందని, ఇప్పటికే ఎంతో మంది కళాకారులను ఆ దిశలో సహాయ, సహకారాలను అందిస్తున్నామన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు రాష్ట్రంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా యూత్ లైఫ్టైమ్ అఛీవ్మెంట్ అవార్డ్ను ప్రముఖ గాయకురాలు మధుప్రియకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి, తెలంగాణ రాష్ట్ర పోలీస్ అధికారి రామ్దాస్ తేజావత్, సంఖ్య శాస్త్ర నిపుణుడు దైవజ్ఞశర్మ, నిర్వాహణ సంస్థ అధ్యక్షుడు కె.విక్రమాదిత్య, టీవీ ఆర్టిస్ట్ శ్రీవాణి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.