రవీంద్రభారతి, మార్చి 27: ప్రపంచ రంగస్థల దినోత్సవ సందర్భంగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ, తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సంయుక్తాధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహిస్తున్న నాటకోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎక్సైజ్, క్రీడా, భాషా సంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కేవీ రమణాచారి విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ అంతరించిపోతున్న నాటక రంగాన్ని కాపాడి సమాజంలో మంచి మార్పును తీసుకువస్తూ, చెడును పారద్రోలి రంగస్థల నటులను కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంపై,ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ కవులను, కళాకారులను గుర్తించి ప్రోత్సహిస్తున్నారన్నారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ వృద్ధ కళాకారులకు పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నాడన్నారు.
మూడు రోజులుగా ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, కార్యదర్శి జి. వసుంధరలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కళాకారులను మెమోంటో, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు రమణాచారి మా ట్లాడుతూ ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా కళాకారులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపారు. నాటకం ప్రశ్నిస్తే, సమస్యలను పరిష్కరిస్తుందన్నారు.నాటకాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కళలకు, కళాకారులకు ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభు త్వం చేయూతనిస్తుందని పేర్కొన్నారు.
అలరించిన సత్యపీఠ నాటకం
డాక్టర్ బీఎన్.రెడ్డి రూపొందించిన సత్యపీఠ సాంఘిక నాటక ప్రదర్శన ఎంతగానో అలరించిం ది. తెలంగాణ సంగీత అకాడమీ , తెలంగాణ భా షా సంస్కృతిక శాఖ సంయుక్తాధ్వర్యంలో మూ డు రోజులుగా ఘనంగా తెలంగాణ నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రంగస్థల నాటకోత్సవాలు విజయవంతం చేసినందుకు గాను కళాకారులకు తెలంగాణ సంగీత నాటక అకాడమీ కార్యదర్శి జి. వసుంధర ధన్యవాదాలు తెలిపారు. నటులు, కళాకారులను సత్కరించడం సంతోషంగా ఉందన్నారు.