రవీంద్రభారతి, సెప్టెంబర్ 12: నిజాం కాలంలో తెలంగాణను మేల్కొల్పిన గొప్ప వైతాళికుడు సురవరం ప్రతాప్రెడ్డి అని, ఆయన సేవలు చిరస్మరణీయమని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి నాందిపలికన మహనీయుడని కొనియాడారు. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా వనపర్తి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో ‘సురవరం తెలంగాణ ’ 2వ సంపుటి పుస్తకాన్ని ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఆవిష్కరించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. సురవరం గొప్ప సాహితీవేత్తే కాకుండా గొప్ప సాంఘిక, రాజకీయవేత్త అని పేర్కొన్నారు. ఆయన వనపర్తి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో సాంఘిక అసమానతలపై దళిత దండోరా మోగించి, సంహపక్తి భోజనాలు ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. నేటి యువతరం ప్రతాప్రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని తెలుగును, తెలగుభాషను కాపాడుకోవాలని బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. సురవరం పాలమూరు జిల్లాలో జన్మించడం తమ అదృష్టంగా భావిస్తున్నట్టు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి పలువురు కవులు, కళాకారులకు శాలువా కప్పి, సన్మానించారు. కార్యక్రమంలో సీఎంవో ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.