హైదరాబాద్ : ఈ నెల 13 నుంచి విద్యాసంస్థలు రీఓపెన్ కానున్న నేపథ్యంలో.. గిరిజన ఆవాసాల్లో బడికి వెళ్లే వయసున్న పిల్లలను గుర్తించి, పాఠశాలల్లో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ అధికారులను ఆదేశించారు. ఆశ్రమ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిందున, ఆ మాధ్యమంపై పిల్లలకు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.
విద్యాసంస్థల ప్రారంభానికి ముందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, సహాయ ప్రాజెక్టు అధికారులు, డీడీ(టీడబ్ల్యూ), డీటీడీవోలతో హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. ఆదివాసీ ఏరియాల్లో విద్యాసంస్థల ప్రారంభానికి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. బడి పాట పేరుతో ర్యాలీలు నిర్వహించి తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను, పాఠశాల విద్యా కమిటీలను ఇందులో భాగస్వాములను చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు దీటూగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తుందన్నారు.
రాష్ట్రంలో అన్ని సంక్షేమ విద్యాసంస్థల్లో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా తరగతి గదులను సిద్ధం చేయాలన్నారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, యూనిఫామ్స్ను సమకూర్చాలని చెప్పారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించకూడదని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, ఏఎన్ఎంల ద్వారా ఆరోగ్య పరిరక్షణ చేపట్టాలన్నారు.
ఈ సమీక్ష సమావేశానికి గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, స్పెషల్ సెక్రెట్రరి శ్రీధర్, గిరిజన సంక్షేమ శాఖ అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ కళ్యాణ్తో పాటు ఐటీడీఏ అధికారులు హాజరయ్యారు.