బడంగ్పేట,జూలై 31: రాష్ట్రంలో ఉన్న పురాతన ఆలయాలకు ప్రభుత్వం నిధులు కేటాయించి వాటికి పునర్వైభవం తీసుకువస్తుందని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో జీర్ణోద్ధారణ కార్యక్రమం చేపట్టారు. 500 సంవత్సరాల క్రితం వెలసిన పురాతన ఆలయంలో ఉన్న పార్కు అభివృద్ధి, ప్రహరీని, శిథిలావస్థలో ఉన్న వాటికి, రథశాలను పునరుద్ధరించారు. నేలమాలికలను శుభ్రం చేసి దశావతారాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రథశాలను, దశావతార విగ్రహాల కోసం ఏర్పాటు చేసిన వాటిని ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ .. దేవాలయాలను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు.
పురాతన దేవాలయాల అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదల చేస్తుందని పేర్కొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి పచ్చదనాన్ని పెంపొందించే విధంగా చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి ఇంట్లో ఆరు మొక్కలను నాటి భావితరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలన్నారు. ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఫౌండర్ చైర్మన్ రాజా సంజయ్, ధర్మ కర్తలు యాదగిరి, జంగారెడ్డి, రమేశ్, జ్ఞానేశ్వర్ చారి, జలగం జంగయ్యలు మంత్రి పి సబితా ఇంద్రారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో మేయర్ దుర్గాదీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు , టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
పహాడీషరీఫ్, జూలై 31: పేదల పాలిట ఆపన్న హస్తంగా సీఎం సహాయనిధి పనిచేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జల్పల్లి మున్సిపల్ కేంద్రానికి చెందిన దూడల శ్రావణి ఇటీవల అనారోగ్యంతో ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందింది. అధిక ఖర్చు కావడంతో ఆమె కుటుంబ సభ్యులు సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. రూ. 60 వేలు మంజూరు కావడంతో ఆ చెక్కును బాధితురాలి భర్త అరవింద్కు మంత్రి శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మహేశ్వరం నియోజకవర్గ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ యంజాల జనార్దన్, నాయకులు సూరెడ్డి గోపాల్రెడ్డి, పోలమోని నగేశ్ ముదిరాజ్ పాల్గొన్నారు.