బడంగ్పేట, జూలై 17 : నగర శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య రాకుండా ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాలలోని రెండో వార్డులో తాగునీటి పైపులైన్ కోసం రూ. 15.50లక్షలు, రూ. 14.75లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, 3వార్డులో అండర్గ్రౌండ్ డ్రైనేజీకి రూ.15లక్షలు, సర్ధార్నగర్లో రూ.15లక్షలు, 5వ వార్డులో రూ. 20లక్షలతో డ్రైనేజీ, దేవేందర్నగర్లో రూ. 14లక్షలతో సీసీ రోడ్డు, తాగునీటి పైపులైన్ పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 1200కోట్లు కేటాయించారన్నారు. తాగునీటి సమస్య రాకుండా ఉండాలన్న ఉద్ధేశంతో ము ఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె అన్నారు. మున్సిపాలిటీల పరిధిలో పైపులైన్ లేని చోట పైపులైన్ వేయడానికి పాలక వర్గ సభ్యులు, అధికారులు చర్చించి జాబితాను తయారు చేయాలని సూచించారు. రావిర్యాల, సర్ధార్నగర్, మాంఖాల్లో డంఫింగ్యార్డును ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.
వైకుంఠధామాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రూ. 4.50 కోట్లు కేటాయించింద న్నారు. మున్సిపాలిటీలో గ్రీనరీ ఏర్పాటు కోసం పదిశాతం నిధులు కేటాయిస్తున్నామని ఆమె తెలిపారు. గ్రీనరీ పెంచాలన్న సంకల్పంతో నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ప్రతి వార్డులో నర్సరీలను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో రెండు పార్కులను ఏర్పాటు చేయిస్తున్నామని ఆమె అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 5వేల మందికి కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశామని తెలిపారు. ఎంతో మంది ఆడ బిడ్డల పెండ్లీలకు కల్యాణ లక్ష్మి పథకం దోహదపడుతుందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పర్చవలసిన అవసరం ఉందన్నారు. ప్రణాళికబద్ధంగా డ్రైనేజీని ఏర్పాటు చేయబోతున్నామని ఆమె అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో అనేక కంపెనీలు వస్తున్నాయన్నారు. కార్యక్రమంలో తుక్కగూడ మున్సిపాలిటీ చైర్మన్ మధుమోహన్, వైస్ చైర్మన్ భవాని వెంకట్రెడ్డి, కమిషనర్ జ్ఞానేశ్వర్, ఎంఈవో కృష్ణయ్య, తాసీల్దార్ జ్యోతి, కౌన్సిలర్స్, నాయకులు ఉన్నారు.