కందుకూరు, జూలై 14 : నియోజవర్గాన్ని అన్ని రంగా ల్లో అభివృద్ధి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మాదాపూర్ సర్పంచ్ మంద సాయిలు బుధవారం మంత్రిని తన నివాసంలో కలిసి గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నదని తెలిపారు. మారుమూల గ్రామాల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు చెప్పారు. పల్లెప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు మారిపోయాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన అనంతరం గ్రామాలకు మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తుంటే అభివృద్ధికి సహకరించకుండా తమ ఉనికి ఎక్కడ దెబ్బతింటుందోనని ప్రతి పక్షాలు భయపడి ప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా సీఎం కేసీఆర్ ప్రతి నెల గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జబ్బార్గూడ గ్రామ టీఆర్ఎస్ కార్యదర్శి సుధాకర్, నాయకులు పాల్గొన్నారు.