పహాడీషరీఫ్, జూన్ 16: అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 21, 24, 25, 26, 27, 28 వార్డులలో రూ. 87 లక్షల నిధులతో డ్రైనేజీ అభివృద్ధి పనులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. వాది హుదాలో ఉర్దూ ప్రాథమిక పాఠశాల ప్రాథమికోన్నత పాఠశాలగా అప్గ్రేడ్ కావడంతో..దానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమైందన్నారు.
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ సమస్యకు పరిష్కారంగా రూ. 87 లక్షల నిధులతో ఐదు చోట్ల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశానని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకత ఉండేందుకు గాను మున్సిపాలిటీకి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటుకు సీఎం సూచనల మేరకు జల్పల్లి మున్సిపాలిటీకి రూ. 4.50కోట్లు విడుదల అయ్యాయని పేర్కొన్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని వివరించారు. రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కేటీఆర్కు విన్నవించగా.. ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.
రూ. 9 కోట్లతో జల్పల్లి పెద్ద చెరువును బ్యూటిఫికేషన్గా ఏర్పాటు చేయడంతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది, వైస్ చైర్మన్ ఫర్హనా నాజ్, డీఈ విశ్వేశ్వరరావు, ఏఈ కిష్టయ్య, జల్పల్లి కో -ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, కౌన్సిలర్లు షేక్ పహిమిదా అఫ్జల్, సౌద్ అవాల్గీ, శంశోద్దీన్, మజర్ అలీ, కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, ఖాలెద్ బిన్ అబ్దుల్లా, నాయకులు ఇక్భాల్ బిన్ ఖలీఫా, యూసుఫ్ పటేల్, అఫ్జల్, మాజీ సైనికుడు వాసుబాబు, కొండల్ యాదవ్, హమీద్ జైదీ, హసన్ షా తదితరులు పాల్గొన్నారు.