బడంగ్పేట, జూన్ 12: బంగారు తెలంగాణ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్లిలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. మహేశ్వరం నియోజక వర్గంలో గజ్వేల్ తరహాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రూ.4.50 కోట్లతో బడంగ్పేట, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్, జల్పల్లి, తుక్కుగూడలో సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
దేవేందర్ నగర్ నుంచి మామిడిపల్లి వరకు బీటీ రోడ్డు వేయడానికి రూ.3కోట్ల నిధులు కేటాయించినందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం వెయ్యి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒక్కో విద్యార్థిపై లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్న ఘనత కేసీఆర్దే అన్నారు. ఇంటర్లో చదువు ఆపకుండా ఉచిత విద్య, పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు ఆదర్శవంతంగా నిలుస్తున్నాయని అన్నారు.
కరోన కాలంలో కూడా డిజిటల్ తరగతులు నిర్వహించిన ఏకైక రాష్ట్రం మనదే అన్నారు. కార్యక్రమంలో బడంగ్పేట మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్లు యాతం పవన్ కుమార్ యాదవ్, సుక్క శివ కుమార్, రోహిణి రమేష్, మాజీ ఎంపీటీసీ సంరెడ్డి వెంకట్రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ నిమ్మల నరేందర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.