ఆర్కేపురం, మే 24 : కరోనా వైరస్ను కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్డౌన్ను విధించిందని, ఇందుకు ప్రజలందరూ సహకరించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సరూర్నగర్ డివిజన్లోని వీఎం హోం గురుకుల పాఠశాలలో ఉంటున్న 16 మంది అనాథ విద్యార్థులు కరోనాబారిన పడ్డారు. విషయం తెలుసుకున్న మంత్రి సోమవారం ఆ పాఠశాలను సందర్శించి.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విద్యార్థులతో మాట్లాడి, వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని.. మీకు మేం ఉన్నామని.. అన్ని విధాలుగా ఆదుకుంటామని వారికి మంత్రి భరోసా ఇచ్చారు. ప్రతి రోజు సరూర్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ అధికారిణి డా.అర్చన సిబ్బందితో కలిసి పర్యవేక్షిస్తారని అన్నారు.
విద్యార్థులకు ఏమైన ఇబ్బందులు వస్తే.. వెంటనే తన దృష్టికి తీసుకురావాలని పాఠశాల సూపరింటెండెంట్ లక్ష్మీపార్వతికి సూచించారు. నియోజకవర్గంలో కరోనా వైరస్ను కట్టడి చేయడానికి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకునేవిధంగా అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సరూర్నగర్ సర్కిల్ డీసీ హరికృష్ణయ్య, సీఐ సీతారామ్, తహసీల్దార్ రామ్మోహన్రావు, ఎన్టీఆర్నగర్ మార్కెట్ కార్యదర్శి నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బేర బాలకిషన్, ఆకుల అరవింద్ కుమార్, లోకసాని కొండల్రెడ్డి, పారుపల్లి దయాకర్రెడ్డి, సిరిపురం రాజేశ్గౌడ్, మురుకుంట్ల అరవింద్శర్మ, గొడుగు శ్రీనివాస్ముదిరాజ్, పెండ్యాల నగేశ్, రిషి, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.