కందుకూరు, ఏప్రిల్ 24 : రేషన్ డీలర్లకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు పులిమామిడి సువర్ణ లక్ష్మీనారాయణగౌడ్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా డీలర్లు తమ సమస్యలను మంత్రికి వివరించారు.గ్రామాల్లో రేషన్ డీలర్లు ప్రస్తుతం నిత్యావసర వస్తువులను ఐరీష్, ఓటీపీల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో తాము నిత్యా వసర వస్తువులను ఇవ్వడానికి కరోనాతో భయపడుతున్నారని తెలిపారు. ఇప్పటికే అనేక మంది డీలర్లు కరోనా వ్యాధి సోకి మృతి చెందారని ఆమెకు వివరించారు. ఇంకా అనేక మంది కరోనా సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
ప్రతి గ్రామంలో కరోనా సోకిన వ్యక్తులు ఉన్నారని తెలిపారు. నిత్యావసర వస్తువులను తీసుకువెళ్లడానికి వస్తున్నారని ఈ సమయంలో డీలర్లకు కరోనా సోకే ప్రమాదం ఉన్నట్లు వివరించారు. కరోనా వ్యాధి తగ్గుముఖం పట్టె వరకు థర్డ్ పార్టీ వ్యక్తికి అథెంటి ఫికేషన్ ఇవ్వాలని కోరారు. దీంతో డీలర్లకు కరోనా సోకదని తెలిపారు. ఈ విషయంలో తమకు ప్రభుత్వ పరంగా న్యాయం చేయించాలని కోరారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ విఫయాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ దృష్టికి తీసుకవెళ్లి థర్డ్ పార్టీ వ్యక్తికి అథెంటి ఫికేషన్ ఇవ్వడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం నాయకులు చంద్రశేఖర్రెడ్డి,విజయ్, సూర్య,కృష్ణాగౌడ్, సందీప్గౌడ్. శివయాదవ్,ఓంకార్ పాల్గొన్నారు.