బడంగ్పేట, మార్చి23: చెరువుల అభివృద్ధికి ప్రభు త్వం పెద్దపీట వేస్తుంది. దానిలో భాగంగా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువును రూ.7 కోట్లతో అభివృద్ధి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. సర్వే నంబర్ 61లో 70 ఎకరాల చెరువు భూమి ఉన్నట్లు రికార్డులలో ఉంది. విశాలమైన చెరువును సుందరీకరణ చేస్తే ప్రజలకు అనువుగా ఉంటుందని, ఎఫ్టీఎల్ సరిహద్దులను గుర్తించి చెరువు చుట్టూ బండ్ ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్ తరాల కోసం చెరువులను కాపాడి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దనున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తి చేసి త్వరగా పనులు ప్రారంభించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. హెచ్ఎండీఏ నుంచి రూ.7 కోట్లు కేటాయించారు. మొదటి దశలో కట్ట విస్తరణ పనులు చేపట్టనున్నారు. కట్టను విస్తృత పరిచి గ్రిల్స్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం చెరువు కట్ట ఇరుకుగా ఉండటంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఉద్దేశంతో మొదటి దశలో కట్ట విస్తరణ చేయాలని అధికారులు నిర్ణయించారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న మంత్రాల చెరువును సుందరీకరణ చేయడానికి ఇప్పటికే రూ.2.40లక్షలు కేటాయించారు. రూ.1.40కోట్లకు సంబంధించిన పనులు చేశారు. మీర్పేటలో ఉన్న రెండు చెరువులను సుందరీకరణ చేయడానికి నిధులు కేటాయించారు. చెరువులోకి డ్రైనేజీ వాటర్ పోకుండా చెరువుల చుట్టూ ట్రంక్ లైన్ ఏర్పాటు చేశారు. రూ.23కోట్లతో ట్రంక్లైన్ పనులు దాదాపుగా పూర్తి చేశారు. చెరువులోకి వర్షం నీరు పోయో విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో మీర్పేట పెద్ద చెరువు అభివృద్ధి పనులు చేపట్టడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చెరువు పక్కన ఉన్న నాలుగు ఎకరాలలో పార్కును ఏర్పాటు చేయనున్నామని అధికారులు తెలుపుతున్నారు.