కందుకూరు, ఏప్రిల్ 16 : అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని సాయిరెడ్డిగూడ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు శుక్రవారం మంత్రిని కలిసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లతో పాటు గ్రామాభివృద్ధి కోసం నిధులను మంజూరు చేయాలని వినతి పత్రం అంద జేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అనాధిగా వెనుబడిన గ్రామాలు నేడు అభివృద్ధిలో దూసుకుపోతున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి గ్రామాలకు నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తున్నట్లు వివరించారు. అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అభివృద్ధికి ప్రతి నెల నిధులు మంజూరు చేస్తున్నారని, ఆ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలిపారు. ఎక్కడ చూసిన అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలిపారు. టీఆర్ఎస్ ఎస్సీ విభాగం నాయకులు తాండ్ర దేవేందర్, గ్రామ అధ్యక్షుడు గోవర్ధన్ ముదిరాజ్, రాములు, రాములు తదితరులు పాల్గొన్నారు.