పహాడీషరీఫ్, అక్టోబర్ 9: చెరువుల మధ్య అనుసంధాన ప్రక్రియతోనే ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆ దిశగా ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆమె జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ముంపు ప్రాంతాలైన డ్రీమ్ సిటీ, గ్రీన్సిటీ, అమ్రీన్, వాది జుబేన్ కాలనీలో పర్యటించారు. శుక్రవారం రాత్రి గంటసేపు కుండపోతగా కురిసిన వర్షం వల్ల తలెత్తిన సమస్యలను కాలనీ వాసులను అడిగి తెలుసుకున్నారు. చెరువుల మధ్య అనుసంధానం చేస్తూ ఉస్మాన్నగర్ చెరువు నుంచి వచ్చే నీటి కోసం నాలా నిర్మించడానికి రూ. 10 కోట్ల18లక్షలు, సలాల చెరువు నీరు సాఫీగా పోవడానికి రూ. 5 కోట్లతో పనులు చేపట్టనున్నామని, త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు.
అలాగే కొత్తపేట కుమ్మరికుంట నుంచి వస్తున్న నీటి కోసం నాలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. జీఎచ్ఎంసీ దాని పరివాహక ప్రాంతాల్లో చెరువుల మధ్య లింక్ కోసం రూ. 850 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ సూచనలతో మంత్రి కేటీఆర్ కేటాయించారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ జి.పి కుమార్, కౌన్సిలర్లు అహ్మద్ కసాది, జాఫర్భామ్, జింకల రాధిక, శంషోద్దీన్, టీఆర్ఎస్ నాయకులు ఖైసర్ భామ్, యూసుఫ్ పటేల్, ఇక్భాల్ బిన్ ఖలీఫా, చిగిరింత నర్సింహారెడ్డి, షేక్ అప్జల్, ఖాలెద్ అబ్దుల్లా, ఎంఐఎం నాయకుడు శ్రావణ్కుమార్, డ్రీమ్సిటీ, గ్రీన్సిటీ వాసులు అలీ యాఫై, జావిద్ తదితరులు పాల్గొన్నారు.