శంషాబాద్, ఆగస్టు 2: రాష్ట్రంలో డిజిటల్ గ్రంథాలయాల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం శంషాబాద్లో కోటి రూపాయల టీఎస్ఈడబ్ల్యూసీ నిధులతో చేపట్టిన డిజిటల్ గ్రంథాలయ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్సీ వాణీదేవీ, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్గౌడ్తో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు డిజిటల్ గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు సైతం ఈ లైబ్రరీలను వాడుకోవచ్చని సూచించారు.
జిల్లాలో పదిచోట్ల రూ.10 కోట్ల నిధులతో నూతన గ్రంథాలయాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. హైస్కూల్ ఉన్న ప్రతిచోట లైబ్రరీ ఏర్పాటు చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. టీశాట్, ఆన్లైన్, దూరదర్శన్ ప్రసారాలపై కేంద్రం ప్రశంసలు కురిపిస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాలు కట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఆడపిల్లల ఉన్నత విద్య కోసం 33 డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశామని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ డి.వెంకటేశ్ గౌడ్ పాల్గొన్నారు.
కందుకూరు, ఆగస్టు 2: ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని బేగంపేట్, గుమ్మడవెల్లిలో నిర్మించిన రైతు వేదికలను ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, రంగారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డితో కలిసి ప్రారంభించారు.