సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ)/ఉప్పల్: డ్రైవర్లందరూ వ్యాక్సిన్ తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా భావించిన తెలంగాణ ప్రభుత్వం.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టిందని చెప్పారు. అందులో భాగంగానే తొలుత గ్రేటర్లో డ్రైవర్లకు వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుందని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8.5 లక్షల మంది డ్రైవర్లకు వ్యాక్సిన్ అందిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ఉప్పల్ ఆర్టీఏ పరిధిలోని మల్లాపూర్ జాన్సన్ గ్రామర్ స్కూల్లో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఆయన.. మంత్రి మల్లారెడ్డి, రవాణా శాఖ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.
వ్యాక్సిన్ తీసుకున్న డ్రైవర్లతో మాట్లాడి.. అక్కడున్న ఏర్పాట్లపై ఆరా తీశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఆటో, క్యాబ్, మ్యాక్సీ డ్రైవర్లకు టీకాలు వేయడం కోసం గ్రేటర్ పరిధిలో 10 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. గ్రేటర్లో ఉన్న సుమారు 2 లక్షల మంది డ్రైవర్లకు 20 రోజుల్లో వ్యాక్సినేషన్ను పూర్తి చేస్తామని వెల్లడించారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, అర్బన్ ఏరియాల్లోని డ్రైవర్లకు కూడా వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ను నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
అనంతరం కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకుని కొవిడ్ వ్యాప్తిని కట్టడి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం టీఎస్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ.. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్కు అనూహ్య స్పందన వస్తుందని అన్నారు. ట్రాన్స్పోర్టు కమిషనర్ ఎంఆర్ఎం రావు మాట్లాడుతూ.. ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని ప్రతి ఒక్క డ్రైవర్ వినియోగించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఆర్టీఓ రవీందర్, ఎంవీఐలు పాల్గొన్నారు.