రంగారెడ్డి, మార్చి 5, (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కావాలా…బీజేపీ చెబుతున్న అబద్ధాల మాటలు కావాలనేది పట్టభద్రులు విజ్ఞతతో ఆలోచించి ఓటేయాలని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షాద్నగర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన షాద్నగర్ నియోజకవర్గ ఎన్నికల సమావేశానికి మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్గౌడ్తో కలిసి మంత్రి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆమనుగల్లులో ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నతో కలిసి ఎన్నికల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల కోసం, రైతుల కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలుచేసిందని, అన్ని రంగాల్లో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా రూపుదిద్దుకుందన్నారు. అంతేకాకుండా 4 కోట్ల జనాభాగల తెలంగాణ రాష్ట్రంలో 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి కేటీఆర్ బజాప్తా లెక్కచెప్పారని, బీజేపీ పాలిత రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్లలో ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇస్తున్నామని, బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉద్యోగులకు ఎంత వేతనాలు ఇస్తున్నారో లెక్క చెప్పి ఓట్ల్లు అడగాలని రాష్ట్ర బీజేపీ నేతలకు మంత్రి వేముల సవాల్ విసిరారు. కరోనాతో ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించడం ఆలస్యమైందని, త్వరలోనే సీఎం కేసీఆర్ ఉద్యోగులకు న్యాయం చేస్తారన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఐటీఐఆర్ ప్రాజెక్టు, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, తెలంగాణలోని ఇంటింటికి తాగునీరందించే మిషన్ భగీరథకు నిధులివ్వని బీజేపీకి ఓట్లు ఎందుకు వేయాలనేది పట్టభద్రులు ఆలోచించాలన్నారు. బీజేపీ నేతలు కేవలం ఉద్యోగులు, నిరుద్యోగులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునేందుకు చూస్తున్నారని, పట్టభద్రులు వాస్తవాలను గ్రహించి బేరీజు వేసుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో తనను గెలిపిస్తే మూడు రోజుల్లో రాష్ర్టానికి ప్రత్యేక హైకోర్టు తీసుకువస్తానన్న రామచందర్రావు మూడేండ్లయినా హైకోర్టును తీసుకురాలేని ఆయనకు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. విద్యావేత్త, ఉన్నత విలువలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన పట్టభద్రులకు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బీజేపీ ఒక్క సీటు గెలిచి ఎగిరెగిరి పడుతుందని, వంద స్థానాల్లో డిపాజిట్ గల్లంతయినప్పుడు మీ మొహం ఎక్కడ పెట్టుకొన్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని 9 జిల్లాలు కరువు జిల్లాలుగా ఉండేవని, కానీ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం ఆ పరిస్థితి లేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి నిధులివ్వని కేంద్రం ప్రజల సెంటిమెంట్తోనే ఓట్లు కొల్లగొట్టేందుకు చూస్తుందన్నారు.