త్వరలోనే 200 బెడ్లు అందుబాటులోకి
కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి
ఉప్పల్, మే 13: ఈఎస్ఐ దవాఖానలో త్వరలోనే పూర్తి స్థాయి సేవలందిస్తామని, ప్రజలకు కరోనా వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి అన్నారు. కొవిడ్ పేషెంట్లకు వైద్య సేవలు అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. నాచారం ఈఎస్ఐ దవాఖానను గురువారం మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్రెడ్డి సందర్శించారు. దవాఖానలోని పలు విభాగాల్లో కలియతిరుగుతూ రోగులకు కావాల్సిన సౌకర్యాలు, చేపడుతున్న పనులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలోనే కొవిడ్ రోగులకు 200 బెడ్లు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. అవసరమైన పడకలు, ఆక్సిజన్, వెంటిలెటర్లు, మందుల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దవాఖానలో పనులను సత్వరం పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కార్పొరేటర్ శాంతిసాయిజెన్ శేఖర్, సూపరింటెండెంట్ సత్యనారాయణ, డీఎంహెచ్ఓ డా.మల్లికార్జున్, డా.శ్రీనివాస్, భద్రారెడ్డి, నేతలు గడ్డం రవికుమార్, మేకల ముత్యంరెడ్డి, రమణారెడ్డి, గరిక సుధాకర్, చింతల నర్సింహారెడ్డి, కట్ట బుచ్చన్న, అంజి, ఐలేశ్ పాల్గొన్నారు.