కంటోన్మెంట్, జూలై 30: ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులు, కార్మికుల పక్షపాతి అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్లో శుక్రవారం సహకార సంఘాలు, ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీ ఉద్యోగుల ఆత్మీయ సభ జరిగింది. ఈ సభకు అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, పీఏసీఎస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని సొసైటీలను ప్రైవేట్ బ్యాంకులను మించి బలోపేతం చేసే దిశగా ప్రతి ఉద్యోగి కృషిచేయాలని, దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ మనకు రావాల్సిన పీఆర్సీ కన్నా ఎక్కువగా అమలుచేస్తారని భరోసా ఇచ్చారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్కుమార్ మాట్లాడుతూ, గత పాలకులు సహకార రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, కాని సీఎం కేసీఆర్ వ్యవసాయ, సహకార రంగాలకు పెద్దపీట వేస్తున్నారని గుర్తుచేశారు. త్వరలోనే సహకార ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలయ్యేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్బాబు, ప్రధాన కార్యదర్శి శంకర్గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు మోహన్రావు, రాజు, సాయిరెడ్డి, జంగారెడ్డి, సత్యనారాయణగౌడ్ పాల్గొన్నారు.