హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీలో వివిధ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి పనుల అమలు మరింత వేగంగా జరగాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఆధ్వర్యంలో పాతబస్తీలో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిపై కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ అధికారులతో పాటు.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మున్సిపల్ శాఖ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈసందర్భంగా పురపాలక శాఖ అధికారులు.. మంత్రి కేటీఆర్కు వివిధ పథకాల అమలు పురోగతికి సంబంధించిన వివరాలను అందజేశారు. పాతబస్తీలోని పలు నియోజకవర్గాల్లో ఎస్సార్డీపీ కింద ఫ్లయి ఓవర్లు, రోడ్లు, నాలాల వెడల్పు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, తాగునీటి రిజర్వాయర్, పైపు లైన్లు, ఇతర మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. వీటిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్.. పనులు ఇంకా వేగవంతం కావాలన్నారు. పనుల అమలులో ఏవైనా అవాంతరాలు ఎదురైతే.. వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, అనుకున్న సమయానికే పనులన్నీ పూర్తయ్యేలా అధికారులు శ్రద్ధ వహించాలని మంత్రి స్పష్టం చేశారు.