సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ ) : గతేడాది తన పుట్టిన రోజున గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం చేపట్టి ఆరు అంబులెన్స్లు విరాళంగా ఇచ్చిన మంత్రి కేటీఆర్.. ఈ ఏడాది వంద మంది దివ్యాంగులకు మూడు చక్రాల మోటార్సైకిళ్లు అందజేస్తానని ప్రకటించారు. టీఆర్ఎస్ నేతలు, ఇతరులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి..అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలని ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. మంత్రి కేటీఆర్ పిలుపునకు టీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధుల నుంచి భారీ స్పందన వస్తున్నది. ఈ మానవతా కార్యక్రమంలో మేము సైతం భాగస్వాములవుతామంటూ..గ్రేటర్ నేతలు ముందుకొచ్చారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద తాము కూడా త్రిచక్రవాహనాలు అందించి..దివ్యాంగులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.
గతేడాది మంత్రి కేటీఆర్ తన పుట్టిన రోజున ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్లో భాగస్వాములైన గ్రేటర్ ప్రజాప్రతినిధులు అంబులెన్స్లను విరాళంగా అందజేశారు. రంగారెడ్డి జిల్లాలో ఆరు, మేడ్చల్-మల్కాజిగిరిలో 8, హైదరాబాద్లో ఒక అంబులెన్స్లను విరాళంగా ఇచ్చి ఉదారత చాటారు. ఈ వాహనాలు ఇప్పుడు అపర సంజీవనిగా మారాయి. ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేస్తున్నాయి. కరోనా సంక్షోభంలో ఉపయుక్తంగా నిలిచాయి. కొవిడ్, అత్యవసర సమయాల్లో రోగులకు ఉచితంగా మెరుగైన సేవలు అందిస్తున్నాయి. ఫోన్ కొట్టగానే రయ్..రయ్ …మంటూ వచ్చి బాధితులను దవాఖానలకు తరలిస్తున్నాయి. నిరుపేదలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. అపర సంజీవనులుగా నిలుస్తున్నాయి. గతేడాది మాదిరే ఈ సారి కూడా మానవతా కార్యక్రమంలో పాల్గొని.. దివ్యాంగులకు అండగా ఉంటామని ప్రకటించారు.
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని శనివారం ముక్కోటి వృక్షార్చనలో భారీ ఎత్తున పాల్గొనేలా నేతలు, శ్రేణులు ఏర్పాట్లు చేశారు. తన పుట్టిన రోజు సందర్భంగా తమకు తోచిన విధంగా ఇతరులకు సహాయం చేయడంతో పాటు ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా కనీసం ఒక మొక్కనైనా నాటాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు వీలైనన్ని మొక్కలు నాటాలని సంకల్పించారు. గ్రేటర్ వ్యాప్తంగా 10 లక్షల మొక్కలు, హెచ్ఎండీఏ పరిధిలో 20 లక్షల మొక్కలు నాటేందుకు వీలుగా ఏర్పాట్లు చేయడం విశేషం. వీటితో పాటు రక్తదాన శిబిరం, ఇతర సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా తాను కూడా 100 త్రిచక్రవాహనాలను దివ్యాంగులకు అందిస్తానని ఎమ్మెల్సీ నవీన్కుమార్ ప్రకటించారు. ఈ సారి తన పుట్టిన రోజు సందర్భంగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో వందమంది దివ్యాంగులకు త్రిచక్రవాహనాలను అందించనున్నట్లు కేటీఆర్ ఇప్పటికే ట్వీట్ చేశారని చెప్పారు. అదే స్ఫూర్తితో తాను కూడా 100 వాహనాలను వంద మంది దివ్యాంగులకు అందజేస్తానని మంత్రి కేటీఆర్కు రీట్వీట్ చేశానన్నారు. ‘గతేడాది ప్రజల కోసం అంబులెన్స్లు సమకూర్చారు.. ఈసారి దివ్యాంగులకు అండగా నిలబడ్డారు.. కేటీఆర్ ఆలోచన అద్భుతం’ అని ఎమ్మెల్సీ అన్నారు.