అందరికీ సమాన హక్కులు ఉండాలన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలు ఎంతో గొప్పవని, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా బుధవారం హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే నగరంలోని నడిబొడ్డున అంబేద్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని కేటీఆర్ చెప్పారు. ఏ సమానత్వం కోసమైతే అంబేద్కర్ పోరాడారో దాన్ని సాధించే దిశగా.. దాదాపు వెయ్యి గురుకులాలు స్థాపించామని మంత్రి పేర్కొన్నారు. వాటి ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేద పిల్లలకు మంచి అవకాశాలు అందిస్తూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని వివరించారు. బడ్జెట్లో బడుగు బలహీన వర్గాలకు రూ.21300 కోట్లను కేటాయించిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. నేటి యువత అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.