సిటీబ్యూరో, సెప్టెంబరు 18(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత కార్యకలాపాలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు నగర ప్రజా ప్రతినిధులను, సీనియర్ నాయకులను ఆదేశించారు. టీఆర్ఎస్ పార్టీ నగర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ ఆలీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ మేయర్, నియోజకవర్గాల ఇన్చార్జిలతో కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలలోని నియోజకవర్గాల వారీగా కమిటీ నిర్మాణాలపై కేటీఆర్ ఆరా తీసారు. ఇప్పటికే హైదరాబాద్ నగరం మినహా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో పార్టీ స్థానిక కమిటీల నిర్మాణం పూర్తయ్యిందని, ఇదే స్ఫూర్తితో నగరంలోనూ డివిజన్ కమిటీల నిర్మాణం సెప్టెంబర్ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఈ సందర్భంగా నేతలకు ఆయన సూచించారు.
పార్టీ కోసం పని చేసే కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్ అన్నారు. పార్టీ కోసం పనిచేసే వారికి కచ్ఛితంగా అవకాశాలు వస్తాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో పార్టీని అజేయమైన శక్తిగా మార్చేందుకు పార్టీ సంస్థాగత నిర్మాణం ఎంతగానో దోహదపడుతుందని, ఈ విషయాన్ని గుర్తించి, ఈ కార్యక్రమాల కోసం ప్రతి ఒకరూ చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. నగరంలోని కార్పొరేటర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు సమన్వయంతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని కేటీఆర్ కోరారు. రానున్న పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు పార్టీ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శులను ఇన్ఛార్జిలుగా నియమిస్తానని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.
పార్టీ పదవులు దక్కించుకోవటానికి గణనీయంగా పోటీ ఉండటం, ఒక్కో పదవికి పదుల సంఖ్యలో పోటీదారులు ఉండటంతో స్థానిక ఎమ్మెల్యేలు, ఆ నియోజకవర్గ బాధ్యులతో పార్టీ రాష్ట్ర బాధ్యులు సమన్వయం చేస్తున్నారు. బస్తీ, కాలనీ (వార్డు), డివిజన్ కమిటీలతో పాటు అనుబంధ సంఘాలు, జిల్లా కార్యవర్గంతో పాటు, డివిజన్ల వారీగా కొత్తగా సోషల్ మీడియా కమిటీలను నియమిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి బస్తీ, వార్డు, డివిజన్ కమిటీలతో పాటు అనుబంధ సంఘాల కమిటీలను పూర్తి చేయడం, ఆ తర్వాత జిల్లా కార్యవర్గం, నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ నేతలకు అవకాశం కల్పించనున్నారు. 4800 కాలనీలు (వార్డు), దాదాపు 1486 నోటిఫైడ్ బస్తీలలో కమిటీలను పూర్తి చేయనున్నారు.
వార్డు స్థాయిలో ఏర్పడే కమిటీలో ఒక అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారితో పాటు ఆరుగురు కార్యవర్గ సభ్యులు మొత్తం 11 మంది ఉండనున్నారు. వీటితో పాటు ఈ నెలాఖరులోగా 150 డివిజన్లకు కమిటీలు వేయనున్నారు. విద్యార్థి, కార్మిక, మహిళా, యువజన, రైతు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, సోషల్ మీడియా అనుబంధ కమిటీలు, ప్రతి కమిటీకి 9 మంది చొప్పున 90 మంది ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలు ప్రతిస్థాయి కమిటీల్లో 51 శాతానికి పైనే ఉండాలని, అలా లేని కమిటీలు చెల్లుబాటు కావని, ఒకటికి రెండుసార్లు స్పష్టం చేశారు.