‘మురుగునీటితోపాటు మానవ వ్యర్థాల శుద్ధితో మహానగరం ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంటుందని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మురుగునీటి శుద్ధిలో మెట్రోనగరాలతో పోల్చితే మనమే ముందున్నామని చెప్పారు. ఇండ్లు, అపార్ట్మెంట్ల సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించేందుకు జలమండలి నూతనంగా ప్రవేశపెట్టిన 87 ట్యాంకర్లను శనివారం పీపుల్స్ప్లాజా వద్ద మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఉప్పల్ నల్లచెరువు వద్ద ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన ఎఫ్ఎస్టీపీ (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్)ని వర్చువల్గా వేదిక మీద నుంచే ఆరంభించారు. చెరువులు, కుంటలను పాడు చేయొద్దన్న ఉద్దేశంతో అధునాతన సెప్టిక్ ట్యాంకర్లు, ఎఫ్ఎస్టీపీలను తెచ్చామని చెప్పారు.మినీ ఎయిర్టెక్ మిషన్లతోపాటు ఎఫ్ఎస్టీపీని అందుబాటులోకి తెచ్చిన జలమండలి అధికారులను మంత్రి అభినందించారు.
ఓఆర్ఆర్ పరిధిలో సెప్టిక్ట్యాంక్ వ్యర్థాలను తీసుకెళ్లేందుకు జలమండలి ప్రత్యేకంగా డయల్ ఏ సెప్టిక్ ట్యాంకర్లను ప్రవేశపెట్టింది. ఇందుకోసం 155313/14420 నంబర్లకు కాల్ చేస్తే సిబ్బంది ఇంటి వద్దకే వస్తారు. ఉప్పల్ నల్లచెరువు ఎఫ్ఎస్టీపీ ప్రారంభమైందని, కుషాయిగూడ సమీపంలోని నాగారం, సాగర్రోడ్డులో ఇంజాపూర్ వద్ద మరో రెండు ఎఫ్ఎస్టీపీలు నిర్మాణ దశలో ఉన్నాయని జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు.
మురుగునీటి శుభ్రతలో ఇప్పటికే దేశంలోని అన్ని నగరాల కన్నా అగ్ర స్థానంలో ఉన్న హైదరాబాద్ మహా నగరం, తన సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటూ ఈ ఎఫ్ఎస్టీపీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని పీవీ నర్సింహరావు మార్గం పీపుల్స్ ప్లాజాలో 87 సెప్టిక్ ట్యాంకుల క్లీనింగ్ వాహనాలకు ఆయన శనివారం జెండా ఊపి ప్రారంభించారు. అలాగే, వర్చువల్ పద్ధతిలో ఉప్పల్ నల్ల చెరువు సమీపంలో నూతనంగా నిర్మించిన ఎఫ్ఎస్టీపీని ప్రారంభించి పారిశుద్ధ్య నిర్వహణ/అవగాహన కొరకు పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, మానవ రహిత పారిశుద్ధ్య నిర్వహణ సాంకేతికతను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ మినీ ఎయిర్ టెక్ మిషన్లను రూపొందించి జలమండలి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
జల మండలి అధికారులను మంత్రి కేటీఆర్ అభినందించారు. ఓఆర్ఆర్ (ఔట ర్ రింగ్ రోడ్) లోపలి గ్రామాల్లోని సెప్టిక్ ట్యాంక్ మానవ వ్యర్థాలను శుద్ధి చేసి ఇటు పర్యావరణానికి అటు ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎఫ్ఎస్టీపీలను రూపకల్పన చేశారన్నారు. ఇంతకు ముందు ఉత్పన్నమయ్యే సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను చెరువులు, కాలువలు, కుంటల్లో పారబోసి ఇటు పర్యావరణానికి హాని చేస్తూ అటు ప్రజల ఆరోగ్యానికి చేటు చేసే పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి, గత దుస్థితిని నివారించ డానికి సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను శుభ్రపరిచే అధునాతన వాహనాలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇలాంటి ఎఫ్ఎస్టీపీ లను హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో మరో 71 ప్రాంతాల్లో నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.
ఈ వాహనాల ఆపరేటర్లకు సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాల నిర్వహణపై శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చామని, వీరు నగరంలోని సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను ప్రతిపాదిత ఎఫ్ఎస్టీపీలలో డంపింగ్ చేయడం వల్ల ప్రజలకు ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నారు. సెప్టిక్ ట్యాంక్ వాహనాల ఆపరేటర్లకు, కార్మికులకు త్వరలోనే హెల్త్ కార్డులు కూడా అందజేస్తామని మంత్రి ఈ సందర్భంగా హమీ ఇచ్చారు.
కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పశు సంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మేల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి, స్థానిక కార్పొరేటర్ విజయా రెడ్డి, జలమండలి ఎండీ దాన కిశోర్, ఈడీ డా. సత్యనారాయణ, జల మండలి డైరెక్టర్లతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రస్తుతం అంబర్ పేట్, నల్ల చెరువు, పెద్ద చెరువు, మీరాలం ట్యాంక్, ఖాజాగూడ, నానక్ రామ్ గూడ, నాగోల్, ఖాజా కుంటలలో ఉన్న ఎస్టీపీల వద్ధ.. 80 కేఎల్డీ (కిలో లీటర్ పర్ డే) సామర్థ్యం గల 8 కో-ట్రీట్మెంట్ ప్లాంట్లను జలమండలి నిర్మించిందని ఎండీ దాన కిశోర్ తెలిపారు. ఇప్పటికే ఇవి అందుబాటులోకి వచ్చాయని, ఇప్పటివరకు 35 మిలియన్ లీటర్ల వ్యర్థాలను ఇవి శుద్ధి చేస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్ నల్ల చెరువు వద్ద ఆసీ (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) సహకారంతో 40 కేఎల్డీ సామర్థ్యం గల ఒక నూతన ఎఫ్ఎస్టీపీని నిర్మించడం జరిగిందని, నాగారం మరియు ఇంజాపూర్ల వద్ద 20 కేఎల్డీ సామర్థ్యం గల మరో రెండు ఎఫ్ఎస్టీసీ నిర్మాణ దశలో ఉన్నాయని వెల్లడించారు. ఓఆర్ఆర్ పరిధిలోని ఏడు కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 18 గ్రామ పంచాయితీల్లో జలమండలి సేవలను మరింత విస్తరించే క్రమంలో నూతనంగా, సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను తరలించే వాహనాలతో పాటు ఎఫ్ఎస్టీపీల (ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్) నిర్మాణం ప్రారంభించిందన్నారు. ఇందులో భాగంగానే జలమండలి ఇప్పటికే ఉన్న ఎస్టీపీలు, ప్రతిపాదిత ఎఫ్ఎస్టీపీల వద్ద సెప్టిక్ వ్యర్థాలను రవాణా, డంపింగ్ కోసం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) సహకారంతో 87 మంది సెప్టిక్ ట్యాంక్ వాహనాల ఆపరేటర్లను ఎంపిక చేసిందన్నారు.
పారిశుద్ధ్య వ్యర్థాల నిర్వహణలో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోని ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తోందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్తో రాష్ట్ర పురపాలక వాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో హైదరాబాద్ మహానగరం నేడు ఒక గొప్ప మైలురాయిగా నిలిచిందన్నారు. ఇంటింటి నుంచి చెత్త సేకరణలో భాగంగా ఇప్పటికే నాలుగు వేల స్వచ్ఛ అటోలను, రోజుకు వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రెండు భవన నిర్మాణ వ్యర్థాల ప్లాంట్లను, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి కొరకు జవహార్నగర్లో రెండు వేస్ట్ టూ ఎనర్జి ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని మేయర్ గుర్తు చేశారు.