నవజీవన సంగతులు
కథలు రకరకాలు. జీవిత అనుభవాల్లో నుంచి తొంగి చూసేవి. ఊహల్లో నుంచి ఉబికి వచ్చేవి. మనసుకు హత్తుకున్న సందర్భం నుంచి పుట్టుకొచ్చేవి. ఏ కథ అయినా అందంగా ఉండాలంటే కథనం బాగుండాలి. కథనం పండినప్పుడే కథ నిలుస్తుంది. పాఠకులను చదివిస్తుంది. రచయిత చెన్నూరి సుదర్శన్ రాసిన ‘జీవన గతులు’ కథా సంపుటి ఈ కోవకే చెందుతుంది. పసందైన కథలను ఏర్చికూర్చి ఈ సంపుటిని తీర్చిదిద్దారు ఆయన. వివిధ పత్రికలకు, ఆన్లైన్ మాధ్యమాలకు ఆయన రాసిన కథల్లో మేలైన వాటిని ఎంపిక చేసి ‘జీవన గతులు’ శీర్షికన సంకలనంగా తీసుకొచ్చారు. ఇందులో ఊహించని మలుపుల కథలున్నాయి, ఊరించే వలపుల కథలున్నాయి. ఆదర్శంగా తీసుకునే ‘విజయకేతనం’, ఈసడించుకునే ‘మగబుద్ధి’ ఇలా ప్రతి కథా విభిన్న కోణాన్ని ఆవిష్కృతం చేసేదే. వీటిని చదువుతున్నంత సేపూ ఆ పాత్రలు కండ్లముందు కదలాడుతాయి. అవి పలికే మాటలు జీవిత సత్యాల్ని బోధిస్తాయి. పైకి వ్యక్తుల చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపించే ‘జీవన గతులు’ అంతర్లీనంగా సామాజిక చైతన్యాన్ని కలిగిస్తాయి. ప్రతి కథ ఓ నీతిని తెలియజేస్తుంది. ప్రతి కథకు కొనసాగింపుగా ప్రచురించిన ప్రముఖుల స్ఫూర్తివాక్యాలు ఆ కథలకు మరింత వన్నె తీసుకొచ్చాయి.
జీవన గతులు (కథా సంపుటి)
రచన: చెన్నూరి సుదర్శన్
పేజీలు: 170, వెల: రూ.99
ప్రతులకు: చెన్నూరి సుదర్శన్, 94405 58748
గేయాల హారం
తెలుగు సాహిత్యంలో బాలల సాహిత్యం సన్నగిల్లుతున్నది. అందులోనూ గేయ సాహిత్యం అరుదుగా వస్తున్నది. బాలల వికాసానికి తోడ్పడే రచనల ప్రచురణ, ప్రచారం కూడా తగ్గిపోతున్నది. బాలలకు దూరమవుతున్న గేయాలను ‘పూలదండ’తో మళ్లీ వారికి పరిచయం చేశారు రచయిత్రి త్రిపురారి పద్మ. సాహితీరంగంలో తన ప్రతిభను చాటుకున్న ఆమె పిల్లల కోసం ఈ ప్రత్యేక గేయాలను ఆవిష్కరించారు. ప్రకృతి గొప్పదం, మానవత్వపు విలువలు, జంతుప్రేమ, దేశభక్తి చిన్నారి హృదయాల్లో నాటుకునేలా వీటిని రచించారు. చిన్నచిన్న పదాలతో భాషా సౌందర్యాన్ని ప్రకటిస్తూనే అందమైన భావాలను అందించారు. మానవుడు తనతోపాటు జీవిస్తున్న జీవజాలంపై కరుణ, దయ, జాలి కలిగి ఉండాలని చెప్పే గేయాలు ఎంతగానో అబ్బురపరుస్తాయి. ‘కోతికొమ్మచ్చి’, ‘చిలుకమ్మ విందు’ తదితర గేయాలు జంతువులతో మనిషి అనుబంధాన్ని తెలియజేస్తాయి. ఇందులోని సందేశాత్మక అంశాలు బాలలకు ఉన్నత విలువలను నేర్పుతాయనడంలో సందేహం లేదు. తెలంగాణ నుడికారం, పలుకుబడులపై వారికి అవగాహన ఏర్పడుతుంది.
పూలదండ (బాలల గేయాలు)
రచన: పద్మ త్రిపురారి
పేజీలు: 59, వెల: రూ. 75
ప్రతుల కోసం: 96524 08848
1-10-113, బ్యాంకు వీధి, జనగామ 506167
అచ్చుల్లో అందం
‘సత్సాహిత్య విశేష భూష లసితమ్…. రామం భజే శ్యామలమ్’ అన్న అద్భుత శ్లోకంతో ప్రారంభమై పేరును సార్థ్దకం చేసుకున్న పుస్తకం ఇది. కథల సమాహారం కాదిది, కవితల సంకలనం అంతకన్నా కాదు. ఒక అద్భుత ఆలోచనా సరళిని రంగరించి రూపుదిద్దుకున్న సంకలనం ఈ పుస్తకం. సామాజిక మాధ్యమంలో తారసపడిన కవి మిత్రులంతా ఒక్కటై వర్ణమాలకు అనుగుణంగా సాగించిన అక్షర సేద్యం ‘రామం భజే శ్యామలమ్’. అకారాది క్రమంలో రచించిన పద్య, వచన కవితల సమాహారంగా దీనిని తీర్చిదిద్దారు. ‘అ’ అవనితో మొదలై.. ‘ఔ’ ఔదార్యం వరకు రకరకాల భావనలను అక్షరీకరించారు రచయితలు. ప్రముఖ కవులు, కొత్తగా రచనా వ్యాసంగం చేపట్టిన రచయితలు, కవయిత్రులు ఎందరో ఈ మహాక్రతువులో పాలుపంచుకున్నారు. నివేదనలు, మనోవేదనలు, స్తుతులు, స్తోత్రాలు ఇలా రకరకాల భావనలతో భాషాప్రియులకు అందమైన కదంబాన్ని అందించారు. ఈ పద్య, కవితా యజ్ఞంలో విఠాల శ్రీకాంతశర్మ, చెప్పెల హరినాథ శర్మ వంటి గొప్ప కవులతోపాటు ముత్యంపేట గౌరీశంకర్ శర్మ, ముదిగొండ అమర్నాథ శర్మ, చుక్కాయపల్లి శ్రీదేవి వంటి అవధానులు మరెందరో ఈ పుస్తకంలో భాగమయ్యారు. మొదటి ప్రయత్నంలో అచ్చుల వరకే అచ్చువేయించిన ప్రచురణ కర్తలు రానున్న రోజుల్లో హల్లులతో అల్లుకున్న పద్య, కవితా లతలనూ భాషాభిమానులకు
పంచడానికి సిద్ధమవుతున్నారు.
రామం భజే శ్యామలమ్
సంపాదకులు: సింగీతం నర్సింహారావు
పేజీలు: 116, వెల: అమూల్యం
ప్రతులకు: సంపాదకులు, 7-28/3,
హరిహర రెసిడెన్సీ, మిట్టపల్లి, సిద్దిపేట-502375
94400 82388
-మంచినీళ్ల సరస్వతి రామశర్మ