నర్సంపేట, మే19 : అందరూ కలిసి కట్టుగా నిలిచి కరోనాను తరిమికొట్టాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. కరోనా కట్టడిపై బుధవారం సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి బుధవారం ఆయన నర్సంపేట నుచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిత, పోలీసు కమిషనర్ తరుణ్జోషి, అధికారులు పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ కరోనా రెండో దశ తీవ్రతను గుర్తించి నివారణ చర్యలను ముమ్మరం చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఐక్య పోరాటం నిర్వహించినట్లుగా కరోనాను అంతమొందించేందుకు కృషి చేయాలన్నారు. తెలుగు ప్రజలను వైరస్ నుంచి రక్షించే క్రమంలో ‘ఆటా’ నర్సంపేట ఆస్పత్రికి రూ.30 లక్షలు అందించినందుకు అభినందనలు తెలిపారు. ఈ నిధులతో దవాఖానలో ఐసీయూ 10 బెడ్స్, 40 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి వచ్చాయని అన్నారు.
ఆటా ప్రతినిధులు తూముల వెంకట్, మిడియాల సుధాకర్రావు నర్సంపేట ఏరియా హాస్పిటల్కు ఆధునిక వైద్య పరికరాలు అందిస్తున్నారని పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు. కరోనా మహమ్మరికి నర్సంపేట నియోజకవర్గంలో రోజుకు 10 నుంచి 12 మంది బలవుతున్నారని అన్నారు. ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ మండలానికి రెండు చొప్పున మొత్తం 14, ఆక్సిజన్ ప్లోమీటర్స్ 100, ఆక్సిజన్ మాస్క్లు 200 అవసరమని వారికి తెలిపామన్నారు. ఇవి ఇండియాలో కొరత ఉన్నాయని ప్రభుత్వం కొనుగోలు చేద్దామన్నా దేశంలో ఎక్కడా లభించడంలేదని ఆయన పేర్కొన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నప్పటికీ ఆక్సిజన్ మాస్క్లు లేకపోవడంతో వాటిని ఉపయోగించుకోలేక కరోనా బాధితులు ఇబ్బందు లు పడుతున్నారని అన్నారు. వీటిని సాధ్యమైనంత త్వరగా రాష్ర్టానికి పంపించి ఇక్కడ ప్రజలను కాపాడాలని ‘ఆటా’ బాధ్యులకు విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారని అన్నారు. ఆధునిక వైద్య పరికరాలను అందజేస్తామని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.
గ్రామాల్లో కరోనా విజృంభణ
గ్రామాల్లో కరోనా కేసులుపెరుగుతున్నాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. కరోనా బాధితులు హోంఐసొలేషన్లో ఉండి వైద్యుల సూచనలు పాటించాలని ఆయన కోరారు. కొవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని, మాస్క్ ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని సూచించారు. కరోనా బాధితులకు హోంఐసొలేషన్ లేకుంటే నర్సంపేటలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉండాలని పెద్ది కోరారు.