సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల ఎన్నికల్లో సీఎం కేసీఆర్ బొమ్మ మీద విజయం సాధిస్తున్నామని హైదరాబాద్ ఎన్నికల ఇన్చార్జి, మంత్రి గంగుల కమలాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం అంబర్పేట, ముషీరాబాద్, గోషామహల్ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ సరళి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ శాతం తక్కువగా నమోదైనప్పటికీ గతంతో పోలిస్తే భారీగా పెరిగిందని.. ఇది టీఆర్ఎస్కే అనుకూలమని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిపై పట్టభద్రులు విశ్వాసాన్ని వ్యక్తపరిచారన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, చల్లా హరిశంకర్, తదితరులు పాల్గొన్నారు.