హైదరాబాద్ : పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ తనపై ప్రయోగించిన పరుష పదజాలాన్ని ఖండిస్తున్నాను అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. ఎప్పటికైనా మధుయాష్కీ నేరాలు నిరూపించి.. ఆయనను జైలుకు పంపి తీరుతానని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ భవన్లో సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో అంకితభావంతో పని చేశాను కాబట్టే తనకు పదవులు వచ్చాయన్నారు. 36 ఏండ్లు కాంగ్రెస్లో పని చేశానని, కార్పొరేటర్ అయిన తర్వాత 22 ఏండ్ల వయసులోనే ఎమ్మెల్యే టిక్కెట్ తనను వరించింద్ననారు. మధుయాష్కీ అమెరికా నుంచి 2003లో రాగానే కాంగ్రెస్ పార్టీ అతనికి టికెట్ ఇచ్చిందన్నారు. మధుయాష్కీ అమెరికాలో ఎన్ని నేరాలు చేశారో.. ఆ చిట్టా అంతా తన దగ్గర ఉందన్నారు. దొంగ సర్టిఫికెట్లతో జనాలను అమెరికాకు పంపింది మధుయాష్కీ ముఠా కాదా? అని ప్రశ్నించారు. అమెరికాలో అటార్నీ పరీక్షలు రాసి ఆరు సార్లు ఫెయిల్ అయిన ఆయన.. తాను అటార్నీ అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఆయన దొంగ చదువు అందరికీ తెలిసిందే అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అమెరికాలో ఆరు నెలలు, ఇక్కడ ఆరు నెలలు ఉండే మధుయాష్కీ తన గురించి తెలియకుండా మాట్లాడటం సరికాదన్నారు. ఆయన లాగా తాను మాట్లాడగలను.. కానీ సంస్కారం అడ్డు వస్తుందన్నారు. నకిలీ వీసాల ముఠా నడిపిన యాష్కీని కటకటాల పాలు చేస్తానని హెచ్చరించారు. న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో జైలు శిక్ష తప్పించుకునేందుకు అక్కడ కాళ్లబేరానికి మధు యాష్కీ పాల్పడ్డాడు. ఎప్పటికైనా నేరాలు నిరూపించి యాష్కీని జైలుకు పంపి తీరుతా అని స్పష్టం చేశారు సుధీర్ రెడ్డి. మధుయాష్కీ నేరాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని తేల్చిచెప్పారు. కాంగ్రెస్ నేతల చిట్టా చాలా ఉంది.. అందరి బండారం బయట పెడతాం.. సమయం వచ్చినపుడు చెబుతాను అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.