పట్నా: బీహార్లోని పట్నాలో ఘోరం జరిగింది. తనపై భార్య కేసు పెట్టిందన్న కోపంతో పిల్లలను చంపాడో భర్త. పట్నా రూరల్ జిల్లా కన్హాయ్పూర్ గ్రామానికి చెందిన కమల్దేవ్.. వీణా దేవి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి అంకిత్ కుమార్ (6), అలీషా (3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, వారిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. వీణా దేవి పలువురితో అక్రమసంబంధం కలిగి ఉందని, ఆమెతో కమల్దేవ్ తరచూ గొడవపెట్టుకునేవాడు. ఈ క్రమంలో ఆమెపై భౌతికంగా దాడి చేశాడు. ఎలాగోలా తప్పించుకున్న ఆమె పిల్లలను అక్కడే వదిలేసి తన పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లిదండ్రులతో కలిసి కమల్దేవ్పై గృహహింస, అదనపు కట్నం అడుగుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీంతో భార్యపై కోపంతో శుక్రవారం తెల్లవారుజామున ఘాడ నిద్రలో ఉన్న చిన్నారుల తలపై బలంగా కొట్టి చంపేశాడు. అనంతరం ఉదయం 5 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తన భార్య పలువురితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నదని, ఆ పిల్లలు తన వల్ల కలిగిన సంతానం కాదని చెబుతూ మానసికంగా వేదించేదని ఆరోపించాడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి