హైదరాబాద్ : చేతి గ్లౌవ్స్ కోసం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త రూ. లక్ష పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఆన్లైన్ బిజినెస్ డైరెక్టరీ నుండి వివరాలు పొందిన వ్యాపారవేత్త చేతి గ్లౌవ్స్ సరఫరా కంపెనీ అని చెప్పుకునే వ్యక్తిని సంప్రదించాడు. దీంతో సదరు మోసగాడు బ్యాంక్ ఖాతా వివరాలిచ్చి మొదటగా రూ. లక్ష ఖాతాలో జమ చేయాల్సిందిగా తెలిపాడు. నమ్మిన వ్యాపారవేత్త ఆ మొత్తాన్ని అతడు చెప్పిన ఖాతాకు బదిలీ చేశాడు. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.