ఊబకాయం.. కొత్త ఉపాయం!
అధిక బరువు ఓ సమస్య మాత్రమే కాదు, అనేకానేక అనారోగ్యాలకు సింహద్వారం. శరీరంలో కొవ్వు పేరుకు పోవడం వల్ల ఇన్సులిన్ సరఫరా దెబ్బతిని మధుమేహానికి దారి తీస్తుంది. రక్తపోటు, దాన్నుంచి గుండె జబ్బులు పలుకరిస్తాయి. అందుకే, ‘వ్యాయామం చేయండి. బరువు తగ్గించుకోండి’ అనే సూచన తరచుగా వినిపిస్తుంది. కానీ, చాలా సందర్భాలలో ‘మేం ఆహారం తగ్గించేశాం, వాకింగ్ మొదలుపెట్టాం. అయినా, బరువు తగ్గడం లేదు’ అనే ఫిర్యాదు వినిపిస్తూ ఉంటుంది. ఇందుకు ఓ కారణాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. కొందరి శరీరంలోని GKN1 అనే ప్రొటీన్వల్ల, వాళ్లు ఎంత తక్కువ తిన్నా బరువు పెరిగిపోతూనే ఉంటారని తేల్చారు. ఇండియానా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఎలుకలలో GKN1 ప్రొటీన్ను తగ్గించినప్పుడు అవి ఎక్కువ తిన్నాకూడా లావు కాకపోవడాన్ని గమనించారు. అయితే, ఈ GKN1 ప్రొటీన్ను బలవంతంగా నియంత్రించడం వల్ల కాలేయం దెబ్బ తినే ప్రమాదం కనిపించింది. మరిన్ని పరిశోధనల తర్వాత, ఈ ఫలితాలను మనుషులమీద సురక్షితంగా ప్రయోగించే అవకాశం ఉందని అంటున్నారు.
దీర్ఘాయువు రహస్యం!
కొందరు శతమానం జీవించడానికి కారణం? మంచి ఆహారపు అలవాట్లు, సకాలంలో వైద్యం, మానసిక ప్రశాంతత లాంటి కారణాలు వినిపిస్తాయి. వీటితోపాటు మరో ముఖ్యకారణం ‘జన్యువులు’. కొందరి జన్యువులు దీర్ఘాయువుకు అనువుగా ఉండటం వల్లే సునాయసంగా సెంచరీ కొడుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? ‘సుదీర్ఘమైన ఆయుర్దాయానికి జన్యువులు ఎలా తోడ్పడతాయి?’ అనే సందేహం ఇటలీలోని కొందరు పరిశోధకులకు వచ్చింది. ఈ రహస్యాన్ని శోధించేందుకు వాళ్లు 105 సంవత్సరాలకు పైబడిన వృద్ధులనుంచి రక్త నమూనాలు సేకరించారు. వాటిని విశ్లేషించి జన్యుపటం తయారుచేశారు. అదే సమయంలో 60 ఏండ్ల సగటు వయసు ఉన్న మరి కొందరి జన్యుపటాలనుకూడా సేకరించారు. ఈ రెండిటినీ గమనించినప్పుడు COA1, STK17A అనే రెండు జన్యువులు ఇరువయసుల వారిలోనూ చురుగ్గా ఉన్నట్టు తేలింది. వయసు మళ్లే కొద్దీ మనలోని జన్యువులుకూడా దెబ్బతింటాయి. వాటిని సరిచేసే వ్యవస్థసైతం దెబ్బ తినడం వల్ల ఆ నష్టం శాశ్వతంగా ఉండిపోతుంది. కానీ, పైన పేర్కొన్న ఈ రెండు జన్యువులూ ఎప్పటికప్పుడు దెబ్బతిన్న జన్యువులు మరింతగా నష్టపోకుండా కాపాడుతున్నట్లు గుర్తించారు. వయసు మళ్లిన తర్వాతకూడా ఇవి క్రియాశీలంగా ఉంటే వృద్ధాప్యపు ఛాయలు తగ్గుతాయి. ఎవరికి తెలుసు? రానున్న కాలంలో వీటిని సరిచేసే అవకాశం కూడా వస్తుందేమో!
చేతులు కాలకుండానే ఆకులు
రోజూ మన ఆహారంలో గుప్పెడు ఆకుకూరలైనా ఉండాలనేది పెద్దలమాట. వాటివల్ల ఆరోగ్యం మెరుగై వ్యాధులు దరిచేరవని చెబుతారు. ఇందులో నిజానిజాలు తెలుసుకోవాలనుకున్నారు ‘ఎడిత్ కోవన్ విశ్వవిద్యాలయం’లోని పరిశోధకులు. ఇందుకోసం వాళ్లు డెన్మార్క్కు చెందిన 50 వేల మంది ఆహారపు అలవాట్లకు సంబంధించిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో సుస్పష్టంగా తేలిన విషయమేమిటంటే, రోజూ తగినంత ఆకుకూరలు తింటున్న వారిలో రక్తపోటు స్థిరంగా ఉంటుందట. అంతేకాదు! వీరిలో గుండెజబ్బులు వచ్చే ప్రమాదమూ 12 నుంచి 25 శాతం తక్కువగా ఉందట. ‘ఆకుకూరలను తినమన్నారు కదా అని, వాటిని జ్యూస్ చేసి తాగేయడం వల్ల మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదని’ వారు తేల్చారు. అంతేకాదు, ‘మంచిది కదా అని అతిగా తినడం వల్ల, అదనపు ప్రయోజనాలూ కలుగవని’ కూడా తేల్చారు. ఏటా 1.79 కోట్ల మంది కేవలం గుండెజబ్బుల వల్లే చనిపోతున్నారన్న విషయాన్ని గమనిస్తే, ఇలాంటి సమతులాహారం తీసుకోవడం ఎంత అవసరమో తెలుస్తుంది.
కాలుష్యంతో గుండెకు సెగ
అనుమానమే లేదు. మన చుట్టూ పొల్యూషన్ పెరిగి పోతున్నది. రాత్రంతా ఇంట్లో దాక్కొని ఉన్నా బయటికి వెళ్లేటప్పుడు రాజీ పడాల్సిందే. పొగచూరేలా బతుకులు గడపాల్సిందే. కాలుష్యం వల్ల రకరకాల సమస్యలు వస్తాయన్న విషయం కొత్తేమీ కాదు. కానీ, దీనివల్ల మన రక్తపోటు మీద, ముఖ్యంగా పిల్లల రక్తపోటు మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలనుకున్నారు పరిశోధకులు. ఇందుకోసం, ఇప్పటికే జరిగిన కొన్ని పరిశోధనలను విశ్లేషించారు. ఆసియా, యూరప్, అమెరికాలలో జరిగిన 14 పరిశోధనలను గమనించిన తర్వాత తేలిన విషయమేమిటంటే, కాలుష్యంతో రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. కాకపోతే, ఎంతసేపు కాలుష్యంలో ఉంటున్నారు, దాని తీవ్రత ఏమిటి? వంటి విషయాలనుబట్టి ఈ ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. మూడున్నర లక్షలమంది పిల్లలకు సంబంధించిన వివరాలను గమనించిన తర్వాత తేల్చిన విషయమిది.