ఖైరతాబాద్, జూలై 23 : కరోనా కాలంలో చదువులు ముందుకు సాగలేని పరిస్థితి. బడులు, కళాశాలలు కూడా తెరుచుకోని నేపథ్యంలో అటు బోధకులు ఇటు విద్యార్థులు నష్టపోతున్నారు. అనేక మంది ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు పనులు లేక ఇతర ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్న తరుణంలో మైండ్హోస్ట్, లెక్చరర్ క్లబ్ యాప్లు వారి జీవితాల్లో ఆశాకిరణంగా నిలుస్తున్నాయి. ఇండిజాయింట్స్ సంస్థ ఈ యాప్లను అభివృద్ధి చేసి, అందుబాటులోకి తీసుకువచ్చింది. తద్వారా విద్యార్థులకు ఆన్లైన్ చదువులు….బోధకులకు ఆన్లైన్ ట్యూషన్లకు ఈ అప్లికేషన్లు వేదికగా నిలిచాయి. శుక్రవారం ఈ యాప్లను సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ, తెలంగాణ రైతు బంధు సమితి చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సంస్థ సీఈవో ప్రొఫెసర్ శివప్రసాద్ పెద్ది, డైరెక్టర్లు ప్రొఫెసర్ మాధవి, సతీశ్కృష్ణతో కలిసి ఆవిష్కరించారు.
మైండ్హోస్ట్తో విద్యార్థులకు చదువులతో పాటు పరీక్షలు సైతం నిర్వహిస్తాం. లెక్చరర్ క్లబ్ యాప్ ను టీచర్లు, లెక్చరర్లు టుటోరియల్గా వినియోగించుకోవచ్చు. వంద ప్రభుత్వ విద్యాసంస్థలకు ఈ యాప్ సేవలను ఉచితంగా అందించేందుకు సంకల్పించాం. లెక్చరర్ యాప్లో పది మంది విద్యార్థుల వరకు ఉచితంగా ట్యూషన్లు చెప్పుకోవచ్చు. అంతకు మించితే సంవత్సరానికి రూ.999 మాత్రమే యాప్ నిర్వహణ కోసం తీసుకుంటున్నాం. -ప్రొఫెసర్ శివప్రసాద్, సీఈవో ఇండిజాయింట్స్
విద్యార్థులు, లెక్చరర్లకు బహుళప్రయోజనకరమైన యాప్లను రూపొందించడం అభినందనీయం. రాష్ట్రంలోని వంద ప్రభుత్వ విద్యాసంస్థలకు మైండ్హోస్ట్ యాప్ను ఉచితంగా అందించేందుకు ముందుకు రావడం మంచి ఆలోచన.- డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి