న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఓ వ్యక్తిపై దౌర్జన్యానికి పాల్పడి అతనితో బలవంతంగా ‘హిందుస్తాన్ జిందాబాద్’.. ‘పాకిస్తాన్ ముర్దాబాద్’ అని నినదింపచేసిన ఘటన వెలుగుచూసింది. ఈ దాడికి తెగబడిన వ్యక్తిని గత ఏడాది ఈశాన్య ఢిల్లీలో జరిగిన అల్లర్ల నిందితుడు అజయ్ గోస్వామిగా గుర్తించారు. తాజా ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ వీడియోలో గోస్వామి ఓ వ్యక్తిని కొడుతూ హిందుస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ ముర్ధాబాద్ అని గట్టిగా నినదించాలని ఒత్తిడి చేయడం కనిపించింది.
బాధితుడిని కింద పడవేసి తన్నుతుండగా అతడు గోస్వామి కాళ్లను పట్టుకుని వేడుకుంటుండగా తన కాళ్లను విడిచిపెట్టాలని నిందితుడు కోపంగా కసురుకోవడం కనిపించింది. ఈ వీడియో క్లిప్ ఆధారంగా పోలీసులు బుధవారం గోస్వామిపై కేసు నమోదు చేశారు. ఢిల్లీలోని ఖజూరి కస్ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటనను వీడియో తీశారు. ఈ ఘటనకు ఢిల్లీ అల్లర్ల కేసుకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదని డీసీపీ (ఈశాన్య ఢిల్లీ) సంజయ్ కుమార్ సైన్ తెలిపారు. మరోవైపు బాధితుడు ఎవరనేది ఇంకా పోలీసులు గుర్తించలేదు. అతడికీ క్రిమినల్ రికార్డు ఉందని ఢిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు.