హైదరాబాద్, జూన్ 12, (నమస్తే తెలంగాణ)/బొల్లారం: సికింద్రాబాద్ మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసీఈఎంఈ)లో క్యాడెట్ ట్రైనింగ్ వింగ్ (సీటీడబ్ల్యూ) నుంచి 28 మంది విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. వీరికి శనివారం కరియప్ప డ్రిల్ స్కేర్లో పాసింగ్ ఔట్పరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లెఫ్టినెంట్ జనరల్ టీఎస్ఏ నారాయణ్ ముఖ్యఅతిథిగా హాజరై.. క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చినవారికి పతకాలు బహూకరించారు.
క్యాడెట్ జీసీ ఆశిష్కుమార్ బంగారు పతకం దక్కించుకున్నారు. భారత మిలిటరీలోకి అడుగుపెడుతున్న నూతన అధికారులకు ఆహ్వానం పలుకుతున్నానని, వారి వృత్తి జీవితంలో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు నారాయణ్ తెలిపారు. దేశ రక్షణలో ఎదురయ్యే సవాళ్లను సాంకేతికతతో మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంకావాలని క్యాడెట్లకు సూచించారు. కొవిడ్ దృష్ట్యా పాసింగ్ఔట్ పరేడ్ చూసేందుకు క్యాడెట్ల తల్లిదండ్రులను అనుమతించలేదు. పరేడ్ లైవ్ను డిజిటల్ మీడియా ద్వారా అందించారు.