సిటీబ్యూరో, మే 31(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైలులో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రయాణించారు. కారిడార్-1లోని ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి అమీర్పేట ఇంటర్ఛేంజ్ స్టేషన్ వరకు మెట్రో రైలు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా మెట్రోలో ఉన్న ప్రయాణికులతో సీఎస్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్బంగా మెట్రో ప్రయాణికులు మెట్రో రైళ్ల రాకపోకల సమయాలను పెంచాలని కోరారు. మెట్రోలో ప్రయాణం చేయడం చాలా హాయిగా ఉందని, కొవిడ్ నిబంధనలను పాటిస్తున్నారని చెప్పారు. మెట్రోలో ప్రయాణం చేయడం వల్ల ఎంతో వేగంగా తమ గమ్య స్థానాలను చేరుకుంటున్నామని, వీటిని ఎక్కువ సమయం అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. సీఎస్తో పాటు మెట్రో ఎం.డీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ మెట్రో ఎం.డీ కేవీబీ రెడ్డిలు మెట్రో స్టేషన్లోని ప్రాంగణాలను, రైలులోని సీటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. కొవిడ్-19 నిబంధనల అమలులో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం నుంచి లాక్డౌన్ సమయాన్ని కుదించిన నేపథ్యంలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు మెరుగైన సేవలందించేలా ఏర్పాట్లు చేయాలని సీఎస్ మెట్రో అధికారులకు సూచించారు.
మెట్రో రైలులో ప్రయాణించిన సీఎస్ ప్రయాణికుల కోరిక మేరకు మెట్రో రైలు సేవలను మరింతగా పొడిగించాలని మెట్రో అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం, చివరి రైలు ఉదయం 11.45 గంటలకు ఉండగా, మరో గంట పాటు అదనంగా మెట్రో రైళ్లను నడపాలని, చివరి రైలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి బయల్దేరేలా ఏర్పాట్లు చేస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందని సూచించారు. సీఎస్ ఆదేశాలకు అనుగుణంగా మంగళవారం నుంచి మెట్రో రైళ్ల సేవలు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం ఒంటి గంటకు చివరి రైలు బయలుదేరి, 2 గంటలలోపు చివరి గమ్య స్థానం చేరుకుంటుందని ఎల్ అండ్ టీ మెట్రో ఎం.డి కేవీబీ రెడ్డి తెలిపారు.