హైదరాబాద్ సిటీబ్యూరో, మే 29 (నమస్తే తెలంగాణ): కొవిడ్బారిన పడినవారు కొన్ని మందులతో కూడిన మెడికల్ కిట్ను కొనుగోలు చేయాల్సిందే. వాటిలో సిట్రిజన్, డోలో 650, దగ్గుమందు, అజిత్రోమైసిన్, పారాసిటమాల్తోపాటు రోగనిరోధకశక్తిని పెంచుకోవడానికి మల్టీవిటమిన్ టాబ్లెట్లు, విటమిన్ ఏ, సీ, కాల్షియం వంటివి ఉంటాయి. వైద్యులు ఎవరైనా వాటినే రెఫర్ చేస్తున్నారు. కరోనా సెకండ్వేవ్ నేపథ్యంలో కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఆయా మందులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొద్దిమంది అవసరానికి మించి కొని నిల్వ చేసుకొన్నారు. వాటిలో సగానికిపైగా ఇండ్లలోనే నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. మరికొందరు ముందుజాగ్రత్తగా కొనడంతో ఔషధాల కొరత ఏర్పడుతున్నది. దీంతో అవసరమైనవారికి మందులు అందుబాటులేక అనేకమంది కరోనా బాధితులు అవస్థలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితిని స్వయంగా ఎదుర్కొన్న ఆగ్రాకు చెందిన పదకొండేండ్ల బాలిక ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారివద్ద అదనంగా, నిరుపయోగంగా మిగిలిపోయిన మందులను తల్లి సహకారంతో సేకరిస్తూ వాటిని పేదలు, స్వచ్ఛంద సంస్థలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నది.
ఆగ్రాకు చెందిన సుప్రియా మాలిక్ ఇండల్జియో ఎస్సెన్షియల్ పేరిట దేశవ్యాప్తంగా పలురకాల చర్మ సౌందర్య ఉత్పత్తుల వ్యాపారాన్ని నిర్వహిస్తున్నది. దేశవ్యాప్తంగా సరఫరా నెట్వర్క్ను కలిగి ఉన్నది. ఆమె కుమార్తె సహ్రియా మాలిక్ ఆరావళిలోని పాత్వే వరల్డ్ స్కూల్లో చదువుతున్నది. ఇటీవల వారి కుటుంబీకులు కరోనా బారినపడ్డారు. ఆ సమయంలో అత్యవసరమైన ఔషధాలు లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమయంలోనే సహారియా మాలిక్ మనసులో కొత్త ఆలోచన తట్టింది. తల్లి సుప్రియాతో కలిసి కొవిడ్ మెడిసిన్ రీసైకిల్ పేరిట మే 1న వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తమ బిజినెస్ నెట్వర్క్ సహకారంతో దేశంలోని నలుమూలలా కరోనా నుంచి కోలుకున్నవారు, దాతల నుంచి మందులను సేకరిస్తున్నది. అదేవిధంగా ఆక్సిమీటర్లు, థర్మామీటర్లు, నెబ్యులైజర్లు, సిలిండర్లు తదితర వైద్య ఉపకరణాలను కూడా సేకరిస్తున్నది.
దాతల నుంచి సేకరించిన మందులు, వైద్య ఉపకరణాలను ముందుగా శానిటైజ్ చేస్తున్నారు. అనంతరం వాటిని కొవిడ్బారిన పడిన పేదలకు అందజేస్తున్నారు. ఆధార్కార్డు, కొవిడ్ పాజిటివ్ రిపోర్ట్, మందుల ప్రిస్కిప్షన్ను తనిఖీచేశాకే మందులను అందజేస్తున్నారు. వ్యక్తులకే గాకుండా సామాజికసేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, వృద్ధాశ్రమాలకు సైతం పంపిణీ చేస్తున్నారు. ఇప్పటివరకు 100 మందికి పైగా దాతలు 7,800 పైగా మందులను అందజేశారు. వారికి ఎక్కువగా మందులను వితరణ చేస్తున్నవారిలో హైదరాబాద్, గుర్గావ్కు చెందినవారే ఎక్కువ మంది ఉన్నారని సుప్రియా మాలిక్ వెల్లడించారు.
కొవిడ్ బారినపడినవారు చాలామంది మోతాదు మించి మందులను కొనుగోలుచేస్తున్నారు. అందులో సగం మేరకు మాత్రమే వాడుతున్నారు. మిగిలివాటిని వృథాగా ఉంచుతున్నారు. దానివల్ల ఎవరికీ ప్రయోజనం ఉండటం లేదు. ఆ మందులను పేదలకు అందజేస్తే ఆర్థికంగా వారికి కొంతభారం తప్పించినట్లవుతుంది. మందులను ఇవ్వాలనుకునేవారు ఆ ఔషధాలను ప్యాక్చేసి పెట్టి.. 91 70427 80014 నంబర్కు వాట్సప్ ద్వారా తెలియజేయండి. మా ప్రతినిధి వచ్చి వాటిని తీసుకుంటారు. – సుప్రియా మాలిక్, సహారియా మాలిక్