మన్సూరాబాద్, జూలై 13: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు కాలనీల్లో వరదనీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన లోతట్టు ప్రాంతాల్లో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు మంగళవారం నాగోల్ డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలైన అయ్యప్పకాలనీ, ప్రెస్కాలనీ, ఆదర్శ్నగర్లో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి స్థానిక కార్పొరేటర్ చింతల అరుణతో కలిసి పర్యటించారు. అయ్యప్ప కాలనీలో గత వానకాలంలో తలెత్తిన వరద ముంపు సమస్య భవిష్యత్లో తలెత్తకుండా చూడాలని కాలనీవాసులు నగర మేయర్కు విజ్ఞప్తి చేశారు.
చెరువులోకి వచ్చే వరద నీరు తూములు, అలుగు నుంచి ఎప్పటికప్పుడు దిగువకు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని నగర మేయర్ను అయ్యప్ప కాలనీవాసులు కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా 24 గంటలు మూడు పాటు షిఫ్ట్ల వారీగా జీహెచ్ఎంసీ అధికారులు, మాన్సూన్ టీమ్లు నిర్విరామంగా పని చేస్తున్నాయని తెలిపారు. గత వానకాలంలో వరదనీటి ముంపునకు గురైన కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టామని.. ఎలాంటి విపత్తులు ఎదురైనా సమస్యను వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. వరద ముంపు సమస్య పరిష్కారం కోసం అయ్యప్పకాలనీ ప్రాంతంలో రూ.30 కోట్లతో బాక్స్టైప్ డ్రైనేజీ ట్రంకులైన్ను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
బండ్లగూడ చెరువుకు సరైన అవుట్లెట్ లేదని ప్రజలు ఫిర్యాదు చేశారని.. ఇరిగేషన్ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ ఈఈతో మాట్లాడి బండ్లగూడ చెరువు అవుట్లెట్ సమస్యపై చర్చించి సమస్యను పరిష్కరింపజేస్తానని తెలిపారు. బండ్లగూడ చెరువులోకి చేరుతున్న వరదనీటిని ఎప్పటికప్పుడు తూములు, అలుగు నుంచి దిగువకు పోయే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. కొన్ని సంవత్సరాలుగా అయ్యప్పకాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న వరదముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ మారుతీదివాకర్, ఈఈ రాజయ్య, ఇరిగేషన్ ఏఈ నాగరాజు, నాయకులు లక్ష్మీజగదీశ్వరి, గౌరి, శ్యామల తదితరులు పాల్గొన్నారు.