పారిశుధ్య నిర్వహణలో అధికారుల పనితీరుపై మహా నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అసంతృప్తి వ్యక్తం చేశారు. రహదారులపై గుట్టగుట్టలుగా పేరుకుపోయిన చెత్త నిల్వలు, అధికారుల పనితనంపై మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ ఆదేశించినా క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడం పట్ల ఆమె ఒకింత గరమయ్యారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు జరుగుతున్న స్పెషల్ శానిటేషన్లో భాగంగా ఖైరతాబాద్, చార్మినార్ జోన్లలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మేయర్ ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. రోడ్లపై అడుగడుగునా భారీగా చెత్త ఉండటం పట్ల మేయర్ అసహనం వ్యక్తం చేశారు. మెహిదీపట్నంలోని విజయనగర్ కాలనీ రోడ్డుపై కిలోమీటర్ మేర చెత్త ఉండటాన్ని పరిశీలించి మేయర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తక్షణమే డీసీ అలీని పిలిపించి వెంటనే తీయించాలని ఆదేశించారు.
ఆ తర్వాత జోనల్ కమిషనర్ ప్రావీణ్యకు ఫోన్ చేసి మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ జోన్లో చాలా చోట్ల చెత్త నిల్వ ఉందని, వెంటనే వాటి మొత్తాన్ని తీయించాలని సూచించారు. నగరంలో ఎక్కడా చెత్త నిల్వలు కనపడవద్దని విజయలక్ష్మి చెప్పారు. అంతకు ముందు ఖైరతాబాద్ జోన్లోని గుడి మల్కాపూర్ డివిజన్ సంతోష్నగర్ కాలనీలో నిల్వ ఉన్న చెత్తను చూసి స్థానిక అధికారి కృష్ణను మేయర్ మందలించారు. వెంటనే నిల్వ ఉన్న చెత్తను తీయించాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణలో భాగంగా ఎంత మంది కార్మికులు విధులకు హాజరయ్యారో బయో మెట్రిక్ను మేయర్ పరిశీలించగా, 18 మందికి గానూ 15 మంది మాత్రమే హాజరు కావడాన్ని మేయర్ గుర్తించారు. సున్నం, చీపుర్లు, బ్లీచింగ్ పౌడర్ రావడం లేదని ఈ సందర్భంగా కార్మికులు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. మెడికల్ ఆఫీసర్ ఖాన్ పనితీరు బాగలేదని వారు చెప్పారు.
రెడ్హిల్స్ డివిజన్లోని మొఘల్ ఖానా నాలా వద్ద చెత్తను చూసిన మేయర్ పారిశుధ్య కార్మికులకు చెప్పి తీయించారు. అక్కడి నుంచి రామ్సింగ్ పుర రాధాకృష్ణ మందిరం వద్ద గోవు చనిపోయి ఉన్న ప్రదేశాన్ని చూసి అక్కడున్న చెత్తతో పాటు ఆ గోవును తీయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రామ్సింగ్పురాలో ఉన్న జనాలు రోడ్డు మీద చెత్త వేయడం చూసి వారికి వేయొద్దని మేయర్ వారికి ఈ సందర్భంగా అవగాహన కల్పించారు. జియాగూడ డంపింగ్ యార్డ్లోకి వెళ్లగా అక్కడ రాంకీ ప్లాంట్ పనిచేయకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే ఉండటం చూసి మేయర్ ఒకింత అసహనానికి గురయ్యారు. వెంటనే మరమ్మతు పనులు చేపట్టి ప్లాంట్ను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అక్కడి నుంచి సాయిదుర్గా నగర్ నుంచి పురానాపూల్ వెళ్లొస్తూ 100 అడుగుల రోడ్డులో వెళుతున్న సమయంలో మురుగు నీరు, చెత్తను వెంటనే తీసి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆ తర్వాత చార్మినార్ జోన్లోని పేట్ల బురుజు, శాలిబండ, ఫలక్నుమా, చార్మినార్లలో పర్యటించిన మేయర్ రోడ్డు మీదున్న చెత్తను వెంటనే తీయించాలని జోనల్ కమిషనర్ అశోక్ సామాట్న్రు ఆదేశించారు. బేగంబజార్, చింతల్ బస్తీ, ఉస్మాన్గంజ్లో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఫలక్నుమాలోని బ్రిడ్జిని పనులను మేయర్ పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.