బంజారాహిల్స్, ఆగస్టు 5: అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇప్పించేందుకు కృషి చేస్తామని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను గురువారం స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి మేయర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో కార్డులు మంజూరు చేయడం జరిగిందన్నారు. రేషన్కార్డులు రానివారు తిరిగి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే అధికారులు పరిశీలించి కొత్త కార్డులు అందిస్తారన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. పేదలకు అన్ని రకాలుగా సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ సర్కిల్- 7 ఏఎస్ఓ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.